పన్ను చెల్లింపుదారులు ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదాయ పన్ను అధికారి జివీఆర్ ప్రకాష్ శర్మ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో హైద్రాబాద్ ఆదాయపు పన్ను శాఖ అదనపు కమీషనర్ 3 తేజావత్ వెంకన్న ఆదేశాల మేరకు డీటీవో రవికుమార్ అధ్యక్షతన ఆదాయపన్ను చెల్లింపుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో తప్పులు, మినహాయింపులు, తగ్గింపులపై మాట్లాడుతూ ఆదాయపు పన్ను శాఖ చెల్లింపు దారులు దాఖలు చేసిన రిటర్న్ల యొక్క ఖచ్చితత్వాన్ని కూడా పర్యవేక్షిస్తుందన్నారు. తగ్గింపులు, మినహాయింపులు, క్లైంలు ఎక్కువ చూపుతూ తప్పుడు ఐటీ రిటర్న్ దాఖలు చేయడం ద్వారా రిఫండ్ కోసం క్లైం చేపడుతారన్నారు. అలాంటి చాలా మంది ఉద్యోగులు వారు పనిచేస్తున్న సంస్థల ఖాతాల విభాగం ద్వారా తీసివేయబడిన టీడీఎస్లో 75 నుంచి 90 శాతం వరకు రీఫండ్లను క్లైం చేశారన్నారు. తప్పుడు తగ్గింపులు క్లైం చేయడం ద్వారా ఆదాయం తక్కువ తప్పుగా నివేదించడం వల్ల కలిగే పరిణామాలు అదనపు పన్నుపై వడ్డీని, అదనపు పన్నులో 200 శాతం పెనాల్టి తీవ్రమైన కేసులో ప్రాసిక్యూషన్, జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. ఈ నెల 31 వరకు ఆదాయపు పన్నులను దాఖలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ బాబు రావు, చార్టెట్ అకౌంటెంట్లు, పలు కార్యాలయాల డీడీవోలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.