మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పెంపు

– ఈనెల నుంచే వర్తింపచేయాలని సర్కారు నిర్ణయం
– రాష్ట్రవ్యాప్తంగా 54,201 మందికి ప్రయోజనం
– నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి
– తొలిమెట్టు విజయవంతం కోసం వార్షిక ప్రణాళిక
– విద్యార్థుల్లో సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఏటా అచీవ్‌మెంట్‌ సర్వే ొ వారంలో యూనిఫారాలు అందించకుంటే బాధ్యులపై చర్యలు : అధికారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్‌-కమ్‌ హెల్పర్లకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా ఏడాదికి రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం పొందుతున్నారు. వారి వేతనాన్ని రూ.రెండు వేలు పెంచుతున్నట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జులై నుంచి వారి వేతనం పెరుగుతుండడంతో ఆగస్టులో వారు రూ.మూడు వేల గౌరవ వేతనం తీసుకుంటారు. శనివారం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో నిర్వహించిన జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో) సమావేశంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలనీ, పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా బాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఈ ఏడాది ప్రత్యేకంగా వార్షిక ప్రణాళికను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా రాష్ట్రస్థాయి అచీవ్‌మెంట్‌ సర్వే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో చర్యలు చేపడతామని వివరించారు.
పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు చర్యలు చేపట్టాలి. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షలు సమీపించిన తర్వాత తొందర పడటం కంటే, ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని కోరారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ)లకు అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు యూనిఫారాలు ఇంకా అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయనీ, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.