– అరంగేట్ర సీజన్లోనే కాంస్యం
– ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ వరల్డ్కప్
క్రాన్స్ మోంటానా (స్విట్జర్లాండ్) : భారత తొలి ఎలక్ర్టిక్ బైక్ రేసింగ్ జట్టు ‘ఇండీ రేసింగ్’ చరిత్ర సృష్టించింది. అరంగేట్ర సీజన్లోనే పతకం సాధించి ఈ-బైక్ రేసింగ్లో సరికొత్త సంచలనంగా నిలిచింది. స్విట్జర్లాండ్లోని క్రాన్స్ మోంటానా వేదికగా జరిగిన ఎఫ్ఐఎం ఈ ఎక్స్ప్లోరర్ ప్రపంచకప్ ఆఖరు రౌండ్లో ఇండీ రేసింగ్ మహిళా రైడర్ శాండ్రా గోమెజ్ అదరగొట్టింది. మహిళల విభాగంలో శాండ్రా గోమెజ్ చాంపియన్షిప్ టైటిల్ను ఎగరేసుకుపోగా.. ఓవరాల్గా ఇండీ రేసింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ప్రపంచకప్లో భాగంగా జరిగిన నాలుగు రేసుల్లో ఇండీ రేసింగ్ 479 పాయింట్లు సాధించింది. బొనెల్ రేసింగ్ జట్టు 498 పాయింట్లతో చాంపియన్గా అవతరించగా.. 490 పాయింట్లతో హోండా రేసింగ్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో ఇండీ రేసింగ్ రైడర్ శాండ్రా గోమెజ్ 271 పాయింట్లతో సీజన్ విజేతగా నిలిచింది. ఇండీ రేసింగ్ జట్టులోని ఇతర రైడర్లు స్పెన్సర్ విల్టన్, రూనర్ సుదమాన్లు వరుసగా 162, 146 పాయింట్లతో మూడో స్థానంలో నిలిపారు.
ఇదొక ప్రత్యేక అనుభూతి : ‘ఈ రేసింగ్ జర్నీలో తొలి సీజన్లోనే మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించటం గొప్పగా ఉంది. రేసింగ్లోనూ భారత్కు పతకం తీసుకొచ్చే జట్టును మన అభిమానులకు అందించటం నాకు ఒక ప్రత్యేక అనుభూతి. భారత్లో 30 కోట్ల మంది రైడర్లు ఉన్నారు. ఇప్పుడు భారత్లో బైక్ ఉన్న ప్రతి కుర్రాడు రేసింగ్ గురించి స్వప్నిస్తాడు’ అని ఇండీ రేసింగ్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి తెలిపారు