– బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరా నికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈనెల 16 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ఆలస్య రుసుం లేకుండానే ప్రవేశాలను చేపట్టాలని వివరించారు ప్రయివేటు కాలేజీల్లో చేరాలంటే రూ.వెయ్యి ఆలస్య రుసుం చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థులను ఈనెల 16 వరకు చేర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఆ కాలేజీల జాబితాను పొందుపర్చామని వివరించారు.
4.92 లక్షల మంది చేరిక
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇప్పటి వరకు 4,92,873 మంది చేరారని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 83,177 మంది, ప్రభుత్వరంగ కాలేజీల్లో 98,536 మంది, ప్రయివేటు కాలేజీల్లో 3,11,160 మంది ప్రవేశాలు పొందారని వివరించారు.