గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

– ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
– జిల్లాలో కలకలం
– తల్లిదండ్రులు, బిఎస్పి చీఫ్ ఆర్.యస్ ప్రవీణ్ కుమార్, విద్యార్థి సంఘాల ధర్నాలు
– ప్రభుత్వం దృష్టికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్గ్రేషియా…అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
సూర్యాపేట మండలం ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి (17) గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం బైపిసి చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్‌ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9గంటలకు వచ్చి పూలు , గాజులు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్‌వెల్‌డేలో వైష్ణవి పాల్గొన్నది. ఇదే సందర్భంగా తన తల్లికి విడియో కాల్ చేసి ఫెర్వెల్ పార్టీ గురించి చెబుతూ.. చూపిస్తూ తన ఆనందాన్ని తల్లితో పంచుకుంది. సందడి ముగిసిన తర్వాత వైష్ణవి రాత్రి డార్మిటరీ హాల్ కు వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిoది. అయితే హాల్ కు వెళ్లిన వైష్ణవి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహ విద్యార్థులు వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకోని విగతాజీవిగా ఉన్న ఆమెని చూసి షాకయ్యారు. వెంటనే ఆమెను కిందకు దించి రక్షించేందుకు యత్నించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమాచారం ఇచ్చారు. విద్యార్థిని కొన ఊపిరితో ఉండగా ఆమెను అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హాస్టల్‌ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయడంతో వారు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి బోరున విలపించారు.శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్‌ డేకు వెళ్లేందుకు తయారైన తర్వాత వీడియో కాల్‌ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు.
తమ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్‌లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా అక్కడి నుంచే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఫోన్‌లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండడంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల కళాశాల ముందు వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పారు.కాగా సంఘటన పట్ల యస్.ఎఫ్.ఐ విద్యార్ది సంఘం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దానియకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ వైష్ణవి అనుమాస్పద మృతి పై న్యాయ విచారణ జరిపి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కె.వి.పి.యస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో జిల్లా కార్యదర్శి కోటగోపి మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబ లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బిఎస్పి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ కుటుంబo లో ఒకరికి ఉద్యోగం, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని.విద్యాలయలో సైక్రియటిస్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు, పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయిన ఆందోళన విరమించక పోవడంతో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి చేరుకొని కుటుంబం లో ఒకరికి ఉద్యోగం, ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.మరోవైపు ఈ ఘటనపై ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్దిని ఆత్మహత్య సంఘటనతో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా ఈ సంఘటన పట్ల అగ్ర నాయకులు స్పందించక పోవడం పట్ల ఆందోళన కారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా ఆదివారం పట్టణంలోని పలు వివాహా మహోత్సవంలో పాల్గొన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే,బిజెపి నాయకులు సంకినేని వెంకటేశ్వరావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి లు వైష్ణవి పార్థివదేహాన్ని సందర్శించకపోవడం కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం గమాన్హారo.