– రూ.ఒక కోటి నష్టం చేకూర్చిన హరిచందన
– సీఎంఓకు తెలంగాణ ఫార్మా సొసైటీ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆయుష్ డైరెక్టర్ హరిచందన తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సంజరు రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేసి, పత్రికా ప్రకటన విడుదల చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఆమె విఫలమయ్యారని పేర్కొన్నారు. దీంతో ఫార్మసీ కౌన్సిల్కు చెందిన రూ.ఒక కోటి బూడిద పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 వేల మంది ఫార్మాసిస్టుల జీవితాలను ఆమె భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిషన్ వేయాలని సంజరు రెడ్డి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.