మోడీ బిల్డప్‌నే మోయడం అవసరమా?

Is it necessary to carry the Modi buildup?జానపద కథల్లో శక్తులన్నీ కలిసి ఎవరికో పట్టం కట్టాలని చూసినట్టు భారతదేశంలో, పాలక వ్యవస్థలన్నీ కలిసి నరేంద్రమోడీ బీజేపీప్రభుత్వాన్ని మూడోసారి ప్రతిష్టించడానికి పథకాలు వేస్తున్నాయి. ఎన్నికలలో ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలను కుంటున్నాయి. నిజానికి మోడీని త్రీడీలో తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ వ్యూహం వుంది. ఇప్పుడు ఆయన మూడవసారి అధికారంలోకి రావడం అనివార్యమని మోత పరమార్థం అదే. ఎలాగూ గెలిచే మోడీని ఎదుర్కోవడం వృథా అని నూరిపోయడం అందులో భాగమే. తెలుగునాట సీనియర్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో మోడీని మోయడం అనివార్యమని నమ్ముతూ ఆ ప్రచారానికి ఊతమిస్తున్నారు. గత పదేండ్ల నుంచి మోడీకే వత్తాసునిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ కూడా బీజేపీ జోలికిపోకుండా తనవంతు సహాయం అందిస్తున్నారు. ఇక తెలంగాణలో ఓటమిపాలైన మాజీ సీఎం కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌నే ఏకైక శత్రువుగా భావిస్తూ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారు. జాతీయ మీడియా దాదాపుగా మోడీయాగా మారిపోగా తెలుగు మీడియా కూడా ప్రాంతీయంగా తమకు నచ్చినవారికి మద్దతిస్తూ జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలమైన రాగాలే వినిపి స్తున్నది. ఏతావాతా బీజేపీ హ్యాట్రిక్‌ విజయం గురించి వారికన్నా ఎక్కువగా ఈ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వామపక్షాలుగానీ, బీజేపీ ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ దండగమారి ప్రయత్నమనీ, వామపక్షాలు ఏదో సైద్ధాంతికంగా వ్యతిరేకించడం తప్ప చేయగలిగింది లేదనీ అహోరాత్రులు అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా పోరాడ టం సహజంగా జరుగుతుందనే కనీస ప్రజాస్వామిక సంప్రదాయాన్ని కూడా భరించలేకపోతున్నాయి.
రాజకీయ ప్రత్యామ్నాయాల నేపథ్యమేమిటి?
నిజంగానే ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి.దేశ విదేశాలలోని గుత్తాధిపతులకు మోడీ రాకకోసం ఎందుకంత పరితపిస్తున్నారనేది ఆలోచించవలసిన అంశం. గతంలో కాంగ్రెస్‌ అవిచ్చిన్నంగా ముప్పై ఏండ్లు దేశాన్ని పాలించింది.ప్రతిపక్షాలకు చాలా తక్కువ సీట్లే వుండేవి.బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ వంటిచోట్ల తప్ప బలమైన ప్రత్యామ్నాయ పక్షాలు కూటములు కూడా వుండేవి కావు. అయినా ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు విస్తారమైన ప్రయత్నం జరిగేది. అందుకు గల అవకాశాలకు తగినట్టు వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతుండేది. ఆ క్రమంలోనే 1957లో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన తొలి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1967నాటికి ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెసే తర ప్రభుత్వాలొచ్చాయి. 1977లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తర్వాత ప్రతిపక్షాల ఐక్యత దాన్ని ఓడించడానికి దారితీసింది. రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ఏర్పడిన ఈ ప్రభుత్వాలు పూర్తికాలం సాగకుండా కేంద్రం కుట్రలు చేసింది.ప్రతిపక్షాల అనైక్యతా అందుకు దోహదం చేసింది, ఎమర్జెన్సీతో ఓడిపోయిన ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగలిగారు.ఆమె దారుణహత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ సానుభూతి వెల్లువలో చరిత్రలోనే లేనంత పెద్ద మెజారిటీతో అంటే 400 పైన స్థానాలతో ప్రధాని అయ్యారు. ఇప్పుడు పాలన చేస్తున్న బీజేపీకి ఆ ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లే వచ్చాయి. ఆ 1984 ఎన్నికల్లో బెంగాల్‌లో సీపీఐ(ఎం), ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ మాత్రమే నిలదొక్కుకో గలిగాయి. టీడీపీ జాతీయ ప్రధాన ప్రతిపక్షం కూడా అయింది. అంతేగానీ పలాయన మంత్రం పాడింది లేదు.1989లో వీపీసింగ్‌ ప్రభుత్వం కూడా వచ్చింది. పాలకపక్షం బలం చూసి లేదా ప్రతిపక్షాల బలహీనత చూసి ముందే చేతులెత్తేసింది లేదు, రాజీవ్‌గాంధీ హత్య తర్వాత మళ్లీ పీవీ నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ కాలంలోనే బీజేపీ మత రాజకీయాలను అయోధ్య వంటి సమస్యలనూ పెంచుతూ శక్తి పెంచు కున్నది. 1989, 1996-97లలో కేంద్రంలో విఫలయత్నాలు చేసి 1998లో తొలిసారి అధికారం చేపట్టగలిగింది. మారిపోయిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మద్దతు అందుకు ప్రధాన కారణమైంది. వాజ్‌పేయి పాలనా సమర్థతలో దేశం వెలిగిపోతోందని ప్రచారం మోగించిన కాలం కూడా మర్చి పోలేము. 2004లో మళ్లీ యుపిఎ సర్కారు ఏర్పడే వరకూ చంద్రబాబు వారికే మద్దతుగా వున్నారని మర్చిపోరాదు. వాజ్‌పేయికి స్వంతంగా మెజార్టీ లేని మాట నిజమే గాని బలపరిచే పార్టీలు చాలా వుండేవి. అయినా ఓటమిపాలు కాక తప్ప లేదు. తర్వాత మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వం రెండు పర్యాయాలు పాలన చేసింది. అణుఒప్పందం తర్వాత వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నా అవకాశవాద ప్రాంతీయ పార్టీలు దానికి మద్దతునిచ్చాయి. మోడీ రెండుసార్లు పాలించడం అసాధారణమన్నట్టు చెప్పేవారు, మన్మోహన్‌ కూడా పదేండ్లు పాలించారనేది దాటేస్తుంటారు.
అవకాశవాదం అనర్థం
అనేక ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, కాంగ్రెస్‌ బలహీనపడటం,వామపక్షాలు ప్రతికూల పరిస్థితిలో పడటం,దేశంలో పాలకవర్గాలు మతవాద, మితవాద రాజకీయాలను ప్రోత్సహించడం, సరళీకరణ విధానాలు అనివార్యంగా మతమార్కెట్‌ తత్వాలను ప్రోత్సహించడం వంటి కారణాల వల్ల బీజేపీ, ఆరెస్సెస్‌లు పట్టు పెంచుకున్న మాట నిజం. దేశ, విదేశీ గుత్తాధిపతులు ఫైనాన్స్‌ పెట్టుబడిశక్తులు కూడా ఆయనకు దన్నుగా నిలిచిన మాటా వాస్తవం. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజాస్వామిక విలువలనే బలహీనపరిచే ప్రయత్నాలు కూడా కాదనలేనివి. అయితే ఈ కారణాలన్నీ ప్రత్యామ్నాయంకోసం పోరాడవలసిన అవసరాన్ని మరింత పెంచుతాయే గాని తగ్గించవు. ఎందుకంటే వీటి అంతిమఫలితం మోసేది శ్రమజీవులు, సామాన్య ప్రజానీకమే. అలాటి ప్రత్యక్ష దాడులే మనం చూస్తున్నాం. ఆ ప్రజలు అందుకు వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలవకుండా మతపరమైన విభజనలు, విద్వేషాలు పెంచడం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఐక్యంగా నిలబడి పొంచివున్న ప్రమాదాన్ని ప్రతి ఘటించవలసి వుంటుంది. అంతేగాని అభివృద్ధి నిరోధక శక్తులు ఎలాగూ విజయం సాధిస్తాయి గనక ప్రజాస్వామిక వాదులు ప్రత్యామ్నాయ శక్తులు ప్రతిపక్షాలు లొంగిపోవాలనడం ఎలాంటి తర్కం?పాలకవర్గాలు స్వార్థ ప్రయో జనాల కోసం ఎంతకైనా దిగజారతాయనే వాస్తవిక అవగాహన లేకుండా ఏదో అవకాశవాదాలతో అంచనా వేసుకోవడం ఎక్కడకు దారితీస్తుంది? ఏపీ, తెలంగాణలలోనే ఈ తరహా ఆలోచనల పర్యవసానాలు చూసూనేవ్తున్నాం, బీజేపీ నిరంకుశత్వాన్ని మతతత్వ రాజకీయాలను నికరంగా ఎదుర్కొనే బదులు ఊగిసలాటలు, లోపాయికారీ పోకడలకు పాల్పడిన ప్రతివారూ మూల్యం చెల్లించక తప్పలేదు.అయినా టీడీపీ, జనసేన దాంతో జతకట్టడానికి ఉబలాటపడ్డాయి, వైసీపీ అప్రకటిత మైత్రి బంధం పాటిస్తున్నది. అయినా సరే మోడీ సర్కారు ఆ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వుంది. తెలంగాణలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య కపట నాటకం నడిపిస్తూ తన పబ్బం గడుపుకొంటున్నది. ఈ పరిణామాల పట్ల స్పష్టమైన కచ్చితమైన వైఖరి తీసుకోకపోతే ఆయా పార్టీలూ రాష్ట్రాలూ కూడా నష్టపోవడం అనివార్యమవుతుంది. కాంగ్రెస్‌ నాయకత్వమే ఆ మెళకువతో అన్ని చోట్ల సరైన వైఖరి తీసుకోలేకపోతున్న తీరును కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ సూటిగా విమర్శించారు. ఇక ప్రాంతీయ పార్టీల బలహీనతలు వుండనే వుంటాయి. కానీ అవేవీ దేశం ముందున్న కర్తవ్యాన్ని మార్చలేవు.
400 సీట్ల పాట, నిరంకుశత్వ బాట
ఇదంతా ఒక ఎత్తయితే అసలు మోడీ మరింత ఆధిక్యతతో అధికారానికి రావడం తథ్యమనే ప్రచారానికి ఆధారమేమిటి? టైమ్స్‌ నౌ,న్యూస్‌ 18, ఇండియా టివీ, ఇండియా టుడే ఇలా ఏవేవో సర్వేలు ఇందుకు ఆధారంగా చూపిస్తుంటారు. జాతీయ మీడియా దాంతో చేతులు కలిపే సర్వే సంస్థలూ ఇంతకన్నా భిన్నమైన అంచనాలు ఎలా ఇస్తాయి? కాకపోతే వాటిలో కూడా మెజార్టీ ఇస్తూనే రకరకాల అంకెలు వదలుతున్నారు.330 నుంచి 411 వరకూ ఎన్‌డిఎకు వస్తాయని లెక్కలు చెబుతున్నారు. సర్వేలు చాలాసార్లు విఫలం కావడం చూశాం. ఒక మేరకు నిజమైనా అంచనాలకు చాలా దూరంలో నిలబడిన పరిస్థితీ చూశాం. యూపీలో బీజేపీ బ్రహ్మాం డంగా వచ్చేస్తుందనీ, హిందీ రాష్ట్రాలలోనూ గుజరాత్‌ లోనూ బలం పెంచుకుంటుందని చెప్పే అంచనాలపై ఆధారపడి ఈ జోస్యాలు చెబుతున్నారు. నిజానికి యూపీలో కూడా ఎస్‌పి కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం అసలు వుండదని చెప్పలేము. బీహార్‌లో రెండు కూటములు పోటాపోటీగా నడుస్తున్నాయి. నితీశ్‌కుమార్‌ కన్నా ఆర్జేడి నాయకత్వం లోని ‘ఇండియా’కే మెరుగైన అవకాశాలు న్నాయి. మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నటి ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినా కాంగ్రెస్‌ ధీటుగానే ఓట్లు తెచ్చుకున్నది.కనక వీటిని ఏకపక్షంగా చెప్పడం చెల్లుబాటు కాదు. బెంగాల్‌లో తృణమూల్‌, ఒరిస్సాలో బీజేడీ ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటాయనే సర్వేల సారాంశంగా వుంది. దక్షిణభారతంలో కర్నాటకలో మాత్రం బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తే తెలంగాణలోనూ ఒక మోస్తరుగా తెచ్చుకోవచ్చే అవకాశం వుంది.కేరళ, తమిళనాడు ఏపీల్లో బీజేపీ నామమాత్రం. ఏపీలో బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి కూడా నష్టమనే అంచనాలూ అనేకం. తమిళనాడులో డిఎంకె కూటమి దాదాపు తుడిచిపెడితే కేరళలో యుడీఎఫ్‌,ఎల్‌డీఎఫ్‌ మధ్యనే సీట్ల విభజన వుంటుంది. మహారాష్ట్రలో పోటాపోటీగానే నడవొచ్చు. ప్రధాన రాష్ట్రాలలో పరిస్థితి ఇలా వుంటే బీజేపీకి ఏదో అపూర్వమైన ఆధిక్యత వస్తుందని ఎలా చెబుతున్నారు?ఈ మధ్య కాలంలో మతరాజకీయాల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల వరకూ ఎన్ని విషయాల్లో మోడీ ప్రభుత్వం నిరసనను ఎదుర్కొంది? నిరుద్యోగం, ధరల పెరుగుదల రాష్ట్రాల అప్పుల భారం వంటి అంశాలు ఆందోళన కలిగిం చడం లేదా? ఆ ప్రభావం ఓటర్లపై వుండనే వుండదా?
బీజేపీకి నిజంగా తిరుగులేదనేట్టయితే ప్రతి సందర్భంలోనూ ఏకపక్షంగా చర్యలు తీసుకోవలసిన అవసరమేమొచ్చింది? ఈ అయిదేండ్ల కింద నడిచిన రైతాంగ ఆందోళనను అణచివేశామనుకుంటే మళ్లీ మొదలవలేదా? అప్పటి పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన కూడా కొత్తరూపంలో మొదలవలేదా? మీడియా నోరు నొక్కేందుకు ప్రతిపక్షాల ఖాతాలనూ, కార్యకలాపాలనూ అడ్డుకునేందుకు రకరకాల అప్రజాస్వా మిక చర్యలకు పాల్పడాల్సిన అవసరమేమొచ్చింది? అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌సోరేన్‌ వంటి సీఎంల అరెస్టు ఏం చెబుతుంది? నిజమైన సమస్యలను పక్కదోవ పట్టించడానికి కాకపోతే కచ్చతీవు వంటిపాత అంశాలను తిరగదోడడం, చైనాతో వివాదాలను పదేపదే పైకి తేవడం, పాకిస్తాన్‌పై ఏదో చేస్తున్నట్టు బిల్డప్‌లు ఇవన్నీ ఎందుకు? ఇంతచేసినా బీజేపీలోనూ, సంఘ పరివార్‌ లోనూ అంతర్గతంగా విభేదాలు రావడం, ఉన్నతాధికా రులే విభేదాలు వెల్లడించడం నిజమే కదా? టీడీపీఎలాగో వెంటబడి పొత్తు కుదుర్చుకుంది కానీ దగ్గరకు వచ్చిన బీజేడీ, అకాలీదళ్‌ వంటివారు కూడా మళ్లీ వెనక్కు పోలేదా? పొత్తుపెట్టుకున్న టీడీపీ అనుకూలంగా వుండే వైసీపీ కూడా తాము మైనార్టీలకు వ్యతిరేకం కాదని చూపుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నాయి?
దేశంలో పరిస్థితి అలా వుంచి అమెరికా జర్మనీ, ఐక్యరాజ్యసమితి కూడా అప్రజాస్వామిక ధోరణులపై ఆందోళన అభ్యంతరాలు వెలిబుచ్చలేదా? వాటి జోక్యం సరైందా అనే ప్రశ్న ఒకటైతే మోడీ సర్కారు చర్యల పట్ల స్పందనలు ఎలా వున్నాయనేది దీన్నిబట్టి విదితమవు తుంది. ఇవి మన ప్రజలు గమనించలేరనీ, స్పందించరనీ అనుకోవడం పొరబాటు. గతంలో చాలాసార్లు చైతన్య వంతమైన తీర్పులతో చారిత్రక మార్పులు తెచ్చిన భారతీయ ఓటర్లు ఇప్పుడు కూడా బొత్తిగా ఆ మెళకువ చూపించకపోరు. అది ఏ రాష్ట్రంలో ఏ రూపంలో, ఏ స్థాయిలో వుంటుందనేది వాస్తవంలో చూడాలి. గతంలో ప్రత్యామ్నాయాలు వచ్చినపుడు ఇన్ని ప్రతిపక్ష ప్రభుత్వాలు ఇన్ని ప్రాంతీయపార్టీలూ వుండేవి కావు. కాకపోతే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావంలో మార్పు వచ్చిన మాట నిజమే గానీ బీజేపీతో కలిసినవి తక్కువే. ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే ప్రభుత్వ ఏర్పాటు గురించిన చర్చకు అర్థం వుంటుంది. అప్పుడు ఎవరేమి చేస్తారనేది కీలకం. ఈ లోగా ఎన్నికల సవాళ్లను ధీటుగా ఎదుర్కొ వలసి వుంటుంది. దేనికైనా సిద్ధపడటం వేరు, ముందే చేతులు ఎత్తేయడం వేరు. ముందే మోడీ నాలుగువందల లెక్కలతో అదరగొడితే చెల్లుబాటు కాదని ప్రకటించడం తప్పనిసరి.

– తెలకపల్లి రవి