– 16 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
– 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
– 25న సీట్ల కేటాయింపు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చేనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చేనెల 14 నుంచి 18 వరకు ఆన్లైన్లో సమాచారం అందుబాటులో ఉంచడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరారు. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. వచ్చేనెల 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. అదేనెల 16 నుంచి 21 వరకు అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. 21న వెబ్ఆప్షన్లను ఫ్రీజింగ్ చేస్తామని తెలిపారు. వచ్చేనెల 25న ఐసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 25 నుంచి 28 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం ఆధారంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. అదేనెల రెండున ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందనీ, మూడు వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు. ఏడో తేదీన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేనెల ఏడు నుంచి తొమ్మిది వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు చేరాలని కోరారు. ఇతర వివరాలకు వచ్చేనెల ఐదో తేదీ నుంచి https://tsicet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను సెప్టెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేస్తామని తెలిపారు.