పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం ఆపాలి..

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి..
నవతెలంగాణ కరీంనగర్ 
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తు సీఐటీయూ కరీంనగర్ జిల్లా రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ… పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. పాలస్తీనీయన్లు వారి సంత గడ్డపైనే పరాయివారైపోయారని అన్నారు. పాలస్తీనాను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందని తెలిపారు. హమస్ దాడిని సాకుగా చేసుకొని గాజాలోని సామాన్య పాలస్తినీయన్లను చంపేస్తుందని అన్నారు. పాలస్తీనాకు సంఘీభావంగా శనివారం సిఐటియు రాష్ట్ర వ్యాపితంగా నిరసన తెలియజేస్తున్నదని తెలిపారు.
  అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధకాండ, అమానుష దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్‌ ఈనెల ఏడు నుంచి పాలస్తీనాపై దాడులను ప్రారంభించిందని తెలిపారు. ఈ దాడులను తక్షణమే నిలిపేయాలంటూ ఐక్యరాజ్య సమితి అనేక తీర్మానాలు చేసినప్పటికీ, అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తూ, కుట్రలకు తెగబడిందని విమర్శించారు. వేలాది మంది పాలస్తీనియన్లను హత్య చేసిందని పేర్కొన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులపై సైతం దాడులు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ఆహారం, తాగునీరు అందకుండా చేయడమే కాక ఇతర దేశాలు పాలస్తీనాకు పంపుతున్న సహాయాన్ని కూడా అందకుండా చేస్తున్నాయని తెలిపారు.
  క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు జనరేటర్లకు కావాల్సిన ఇంధనాన్ని కూడా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇప్పటికే మూడు వేల మంది చిన్నారులతో సహా ఏడు వేల మంది మరణించారని వివరించారు. 10 వేలకు పైగా గాయాలపాలయ్యారని తెలిపారు. లక్షల సంఖ్యలో శరణార్దులుగా మారారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఈ యుద్ధాన్ని ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ యుద్ధాన్ని వెంటనే విరమించి పాలస్తీనా ఉనికిని గుర్తించాలని డిమాండ్‌ చేశారు.
  ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు సిహెచ్ భద్రయ్య, ప్రధాన కార్యదర్శి గట్టు సతీష్, ఎస్ రమేష్, ఎలిమి రమేష్, గంజాల గోపి, పిట్టల సంపత్, ఎలవేని, కొమురయ్య, ఎడ్ల మల్లారెడ్డి, ప్రతాపరెడ్డి, గట్టు స్వామి తదితరులు పాల్గొన్నారు.