న్యూఢిల్లీ : బాల్య వివాహాల కట్టడికి సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్య వివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది. ‘బాల్య వివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతం అవుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలి’ అని ధర్మాసనం పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు.