దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్బిల్ పిక్చర్స్పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఈనెల 13న ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది. నాటకరంగం, రంగస్థలం బ్యాక్డ్రాప్లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్కి తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మలాంటింది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది. ఈ సోషల్ మీడియా జనరేషన్లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నాటకరంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకొని ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. బ్రహ్మానందం గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుంటున్నాను’ అని అన్నారు. ‘ఇది చాలా మంచి సినిమా.సినిమా చూసినప్పుడు ఉత్సవంలా ఉంటుంది. తప్పకుండా సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత సురేష్ పాటిల్ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ,’సినిమా చూశాను. చాలా ఫీల్గుడ్ ఫిలిం. ఈ మధ్యకాలంలో రంగమార్తాండ సినిమా చేశాం. అందులో వుండే ఫీల్ కి ఇది నెక్స్ట్ వెర్షన్. లవ్ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫ్యామిలీ అంతా థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఇది’ అని తెలిపారు.