అది గోడ కాదు.. బ్యూటిఫికేషన్‌

– కూల్చేసిన వారిపై కఠిన చర్యలు : ఈరవత్రి అనిల్‌, ప్రీతమ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సచివాలయం సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ గోడ కడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిందని వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు ఈరవత్రి అనిల్‌కుమార్‌, ప్రీతమ్‌, మెట్టు సాయికుమార్‌, పార్టీ నాయకులు సామ రామ్మెహన్‌రెడ్డి, రవళిరెడ్డి, డాక్టర్‌ లింగం యాదవ్‌, అనిత విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. అక్కడ గోడ కట్టడం లేదనీ, చుట్టూ బ్యూటిఫికేషన్‌ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసు కోకుండా మాజీ మంత్రి కేటీఆర్‌ కొంతమందిని రెచ్చగొట్టి పంపించారని విమర్శించారు. పార్లమెంట్‌ బిల్డింగ్‌లాగా అంబేద్కర్‌ విగ్రహం ముందు బ్యూటిఫికేషన్‌ తయారు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి క్రిశాంక్‌ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ప్రీతం విమర్శించారు. ఆయన కాల్‌లిస్టు బయటకు తీస్తామన్నారు. అనంతరం వారు మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఏడీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.