ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం
– భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్‌ తరపున ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-చండూరు
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం నేర్మట గ్రామంలో భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులను గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందని, ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. అభ్యుదయ వాదులకు, అవకాశవాదులకు మధ్య ఈ పోటీ కొనసాగుతుందన్నారు. డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ ప్రాంతంలో భూ పోరాటాలతో పాటు, తాగు, సాగునీటి కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి సాధించామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారానికి ఉద్యమించే తత్వం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, నాయకులు జెర్రిపోతుల ధనంజయగౌడ్‌, సీనియర్‌ నాయకులు అంతిరెడ్డి, సీపీఐ(ఎం) గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, బుర్కల అంజయ్యగౌడ్‌, ఈరగట్ల స్వామి, బల్లెం స్వామి, కొత్తపల్లి లక్ష్మమ్మ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.