సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ చిత్రంతో రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈనెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మీడియాతో ముచ్చటిం చారు. ఆ విశేషాలు..
పలు సినిమాలకు ఘోస్ట్ రైటర్గా పని చేశాను. అలాగే ఓటీటీలో షోలకి కూడా రాశాను. ‘పేపర్ బారు’ టైంలోనే సంతోష్ శోభన్ను కలిశాను. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అలా చివరకు ఈ సినిమా చేశాం. ఈ మూవీ పాయింట్ కొత్తగా ఉంటుంది. అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నా కామెడీ టైమింగ్ ను సంతోష్, శివ బాగా నమ్మేవారు. అలాగే ఈ సినిమాకి నా యాక్టింగ్ కూడా బాగా కలిసి వచ్చింది.
సినిమాల్లో పెళ్లి సీన్లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. కానీ పెళ్ళి పీటలపై ఉన్న ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ఈ సినిమాను తీశాం. విశ్వక్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా టీజర్ చూసినప్పుడు కాస్త భయపడ్డాను. ఇదేంటి నా కాన్సెప్ట్లాగా ఉందే అని అనుకున్నాను. కానీ ఆ మూవీ దర్శకుడితో మాట్లాడాక.. కాన్సెప్ట్ వేరని అర్థమైంది. ఆద్యంతం వినోదభరితంగా ఉండే చిత్రమిది. ఫ్యామిలీతో హాయిగా వెళ్ళి చూడొచ్చు. సంగీత దర్శకుడు అనంత్ శ్రీకర్ ఈ సినిమాకు ఫ్యూజన్ స్టైల్లో మ్యూజిక్ కొట్టాడు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండింగ్ పరంగా కొత్త ఫీలింగ్ వస్తుంది. మా నిర్మాత శివ ప్రసాద్కి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది. ఆయన టేస్ట్కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది.