వామపక్షాలకూ ఐటీ నోటీసులు

IT notices to leftists– న్యాయస్థానం అక్షింతలు వేసినా మారని తీరు
– గతంలో సమాధానానికి గడువు కోరినా ఇవ్వని వైనం
– కుంటి సాకులు చూపుతూ తాఖీదులు
జరిమానాలు, వడ్డీలు కలిపి రూ.1,823 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయపన్ను శాఖ నోటీసు ఇచ్చిన రోజే రెండు వామపక్ష పార్టీలకు కూడా ఇదే రకమైన తాఖీదులు పంపారు. రూ.11 కోట్ల బకాయి చెల్లించాలని సీపీఐకి, రూ.15.59 కోట్లు కట్టాలని సీపీఐ (ఎం)కు నోటీసులు పంపారు.
కొల్‌కతా : పాత పాన్‌కార్డు ఉపయోగించిందన్న సాకు చూపి రూ.11 కోట్లు కట్టాలని సీపీఐకి పంపిన నోటీసులో సూచించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇక సీపీఐ (ఎం)కు సంబంధించి 2016-17లో ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశారు. ఆ మదింపు సంవత్సరానికి సంబంధించి సెక్షన్‌ 148ఏ కింద తమకు నోటీసు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘మదింపుదారుడు బ్యాంక్‌ ఖాతాను నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఖాతాను ఆదాయపన్ను రిటర్న్‌లోని కాలమ్‌ 13 (బి)లో ప్రకటించలేదు’ అని ఆ నోటీసులో తెలియజేశారు. ఈ సెక్షన్‌ కింద మదింపు జరగని ఆదాయంపై నోటీసు అందజేస్తారు.
సీపీఐ (ఎం) ఏం చెప్పిందంటే…
కేంద్ర కమిటీ స్థాయిలో తాము ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను ఫైల్‌ చేస్తామని, ఈ బ్యాంక్‌ ఖాతాను ఉదహరించకపోవడం పొరబాటున జరిగిందని సీపీఐ (ఎం) వివరణ ఇచ్చింది. అయితే దీనిని ఆదాయపన్ను శాఖ 2022 జూలై 29న తోసిపుచ్చింది. కేసును తిరగదోడి సెక్షన్‌ 148 కింద ఇప్పుడు నోటీసు పంపింది. గతంలో తనకు అందిన నోటీసుపై పలు సందర్భాలలో వివరణలు ఇవ్వడం జరిగిందని సీపీఐ (ఎం) వివరించింది. ‘గత సంవత్సరం మే 13న మాకు నోటీసు పంపారు. సెక్షన్‌ 13ఏ కింద పన్ను మినహాయింపు కోరుతూ మేము పంపిన అభ్యర్థనను తోసిపుచ్చినట్లు అందులో తెలిపారు. రూ.22,66,30,515 చెల్లించాలని చెప్పారు. ఈ షోకాజ్‌ నోటీసుకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే…అంటే 2023 మే 13 లోగా సమాధానం ఇవ్వాలని సూచించారు. సవివరమైన సమాధానం అందజేసేందుకు వాస్తవాలను సేకరించాల్సి ఉన్నందున మే 29 వరకూ గడువు ఇవ్వాలని మే 16న కోరాము. అయితే మే 23న ఆదాయపన్ను శాఖ తుది ఆదేశాలు జారీ చేసింది. సీపీఐ (ఎం) సమాధానం దాఖలు చేయలేదని అభియోగం మోపింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15.59 కోట్ల పన్ను విధించింది’ అని తెలియజేసింది.
కోర్టు మొట్టికాయలు వేసినా…
ఈ వ్యవహారంపై సీపీఐ (ఎం) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సమాధానం ఇచ్చేందుకు గడవు పొడిగింపు కోరుతూ పార్టీ నుండి తనకు అభ్యర్థన ఏదీ అందలేదని ఆదాయపన్ను శాఖ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో గడువు పొడిగింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఐటీ శాఖ స్పందించే వర కూ (జూలై నెల) సీపీఐ (ఎం) ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
2022 నుండి సాగుతూనే ఉంది
సీపీఐ (ఎం)కు సంబంధించిన పన్ను వివాదం 2022లో మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ కాంగ్రెస్‌, సీపీఐకి మాత్రం లోక్‌సభ ఎన్నికలకు ముందే నోటీసులు జారీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఎన్నికల బాండ్ల పథకంపై అనేక పౌర సమాజాలు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రాజకీయ పార్టీలలో ఒక్క సీపీఐ (ఎం) మాత్రమే కోర్టును ఆశ్రయించింది. ‘ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని ఇలా నోటీసులు పంపుతున్నారని చెప్పడానికి ఆధారాలేవీ లేవు కానీ అది కేవలం కాకతాళీయం మాత్రం కాదు’ అని సీపీఐ (ఎం) వర్గాలు ‘ది వైర్‌’ పోర్టల్‌కు తెలిపాయి.
బీజేపీకీ జరిమానా వేయాలన్న ఖర్గే
ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ (ఎం), సీపీఐ పార్టీలు భాగస్వాములన్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణంలో అమ్‌ఆదీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఈ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘ప్రతిపక్షాలపై సమర్ధనీయం కాని ఇలాంటి చర్యలకు పాల్పడాలని ఆదాయపన్ను శాఖపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారు?’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. అధికార బీజేపీ రూ.4,600 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, అయితే దానికి మినహాయింపు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ‘2017-18లో 1297 మంది వ్యక్తులు తమ పేర్లు, చిరునామాలు వెల్లడించకుండా బీజేపీకి రూ.42 కోట్లు అందించారని ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం స్పష్టంగా చెబుతోంది. కేవలం రూ.14 లక్షల డిపాజిట్లకే కాంగ్రెస్‌కు రూ.135 కోట్ల జరిమానా విధించారు. మా పార్టీ బ్యాంక్‌ ఖాతాలు స్తంభింపజేశారు. ఈ లెక్కన గత ఏడు సంవత్సరాలలో బీజేపీకి రూ.4,600 కోట్ల జరిమానా విధించాల్సి ఉంటుంది’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు.