అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి..

– జూన్ 15 వ తేదీ లోగా గుడి చెరువు పనులు పూర్తి చేయాలి..
– గుడి చెరువు, పార్క్, అభివృద్ది పనుల పరిశీలన: కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనులు అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ చెరువు ఆవరణలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బండ్ పార్క్ లో కొనసాగుతున్న నిర్మాణాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్క్, ఇతర నిర్మాణ పనులను మ్యాప్ లు పరిశీలించి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు సంప్రదాయ బద్ధంగా, ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఉండాలని సూచించారు. పిల్లల ఆట స్థలాలు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయాలని, రంగులు వేయించాలని ఆదేశించారు. వాకింగ్ ఏరియా, ఓపెన్ జిమ్  తదితర పనులన్నీ జూన్ 15 వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్మికుల సంఖ్యను పెంచి, పనులు త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. నటరాజ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. సూర్య నమస్కార్ వద్ద మొక్కలు, గ్రీనరీ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వేములవాడ మున్సిపల్ ఆద్వర్యంలో నిర్మిస్తున్న పార్క్ ను కలెక్టర్ పరిశీలించి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట టూరిజం సీఈ వెంకటరమణ, డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్ రెడ్డి, డీటీసీపీఓ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.