బౌద్ధుల ఆదర్శ పద్ధతులను, మానవీయ సిద్ధాంతాలను అనుసరించకుండా బ్రాహ్మణులు వారికి ఎదురు నిలవడం అసాధ్యమని తేలిపోయింది. బుద్ధుని మహా పరినిర్వాణం తర్వాత, బౌద్ధులు ఆయన స్ఫూర్తిమంతమైన మూర్తిని శిల్పించుకుని ప్రతిష్టించుకున్నారు. అనేక స్థూపాలను నెలకొల్పుకున్నారు. ఇక, తప్పని పరిస్థితుల్లో వైదిక మతస్థులయిన ఆర్య బ్రాహ్మణులు బౌద్ధారామాల్పి నాశనం చేసి, దేవాలయాలను నిర్మించుకున్నారు. బుద్ధుడి మూర్తిని మార్చి, వాటితో శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు వంటి వారి ఇష్టదైవాల విగ్రహాలనే ఏర్పాటు చేసుకున్నారు.
– డా. బి.ఆర్. అంబేద్కర్.
ఈ చిన్న ప్రకటన విస్తృతమైన చరిత్రను మన కండ్ల ముందుంచుతుంది. మధ్య ఆసియా, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మంగోలాయిడ్ జాతికి చెందిన చెంఘిజ్ ఖాన్ వారసులు కుషాణులు, కుషాణుల్లో మూడవ రాజైన కనిష్కుడి నాణాలను ‘దీవార్’లని అనేవారు మొదటిసారి తన బంగారు నాణాలపై అంటే దీవార్లపై కనిష్కుడు బుద్ధుడి రూపాన్ని ముద్రించాడు. ఈచర్య వలనే బుద్ధుడి విగ్రహాల తయారీ, ఆ తరువాత విగ్రహారాధన మొదల య్యాయి. ఒక రకంగా ఆలయాల నిర్మాణం, విగ్రహాల తయారీ, విగ్రహారాధన, పూజలు- అన్నీ బౌద్ధం నుంచే మొదలయ్యాయనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. వాటిని కొల్లగొట్టి వైదిక మతస్థులు తాము కల్పించుకున్న దేవుళ్లను పూజించడం ప్రారంభించారు. అయితే వారు ఆ విషయం ఒప్పుకోరు. తమదే ప్రాచీన సంస్కృతి అని, తమదే సనాతన ధర్మమనీ ప్రకటించుకుంటూ ఉంటారు. మరి సాధారణ శకానికి ముందు, తాము తమదేవుళ్లకు కట్టుకున్న ఆలయాలు ఎందురు లేవన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. బౌద్ధారామాల విధ్వంసంతోనే తమ ఆలయాల నిర్మాణం ప్రారంభమైందని ఒప్పుకుంటే గొడవే ఉండదు. కానీ, వారు ఆ పనిచేయరు. ఏపీలోని పంచారామాలది కూడా అదే పరిస్థితి.
1.ద్రాక్షారామం 2.భీమారామం 3.సర్పారామం 4.అమరారామం. 5.కొమరారామం. ఈ పంచారామాలలో బౌద్ధ భిక్షువులు ఉండేవారు. కొన్నింటిలో బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఏకాంత నివాస స్థలాన్ని బౌద్ధులు ‘ఆరామమం’ – అని పిలిచేవారు. ఇందుకు వారు ఉచితంగా బౌద్ధ ధమ్మాన్ని (బుద్ధుని బోధనల్ని) బోధించేవారు. వీటిలో గదులు నిర్మించబడి ఉండేవి. ఈ పంచారామాలలో 1.సిద్ధార్థుడి జననం 2. మహాభినిష్క్రమణం 3.సంభోదిని పొందుట 4. సత్యాన్ని బోధించుట 5.మహా పరినిర్వాణం వంటి అయిదు ప్రధానమైన ఘట్టాలను తెలియజేసే విధంగా ఈ పంచారామాలలో బౌద్ధులు అయిదు స్థంబాలు నిర్మించారు. అయితే వీటిని తొలగించిన బ్రాహ్మణులు పైన గుండ్రటి ఆకారాన్ని రూపొందించి ‘శివలింగం’ అంటూ నమ్మించారు. అందుకు తగినట్టుగా కట్టుకథలు ప్రచారం చేశారు. శ్రమ చేయకుండా జీవించాలన్న దురుద్దేశంతో శ్రమన సంస్కృతిని ఒక పథకం ప్రకారం నాశనం చేస్తూ వచ్చారు. ఆంధ్రదేశంలో సాధారణ శకం 9-10(C.E) శతాబ్దాలలో తూర్పు చాళుక్య ప్రభువైన చాళుక్య భీముని కాలంలో బౌద్ధారామాలను శైవ దేవళాలుగా మార్చారు.
బ్రాహ్మనిజం చేసిన ఘోరాలు విద్యారంగంలో, భాషా సాహిత్యాల విషయంలో కూడా ఎంత దారుణంగా ఉండేవో అర్థం చేసుకోవాలంటే ఈ ఉపోద్ఘాతం అవసరమనిపించింది. ఈ నేపథ్యంలోంచి ఆయా విషయాలు చూద్దాం! ‘వేదగణితం’ అని చెప్పబడుతున్నది అసలు వేదాలలో లేదు. మరి ఈవేదగణితం అనే రోగం ఎలా మొదల య్యిందీ? అంటే కొన్ని పూర్వాపరాలు తెలుసుకోవాలి! భారతదేశంలో సింధూ నాగరికత నాటి గణిత పరిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది. వేదకాలంలో గణితశాస్త్రం అభివృద్ధి కానేలేదు. గణితాన్ని అభివృద్ధి చేసినవారు. గణి తంలో సున్నాను (0) కనుగొన్న వారు- బౌద్ధులే! బౌద్ధుల గణిత పరిజ్ఞానమే అరబ్బులకు చేరింది. అతి పెద్ద సంఖ్యల వివరాలు, గణిత పరికర్మలు సాధారణ శకానికి ముందు మూడవ శతాబ్దం (BCE) నాటి బౌద్ధ గ్రంథం ‘లలిత విస్తరం’లో విస్తారంగా ఉన్నాయి. ఆ తర్వాత సాధారణ శకంలో ఆర్యభట్ట (476-550 జ.జు) చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్యభట్ట మొదట నలందా విశ్వవిద్యాలయ విద్యార్థి. తరువాత కాలంలో ఆందులో ఆధ్యాపకు డయ్యాడు. కాలక్రమంలో ఒక విభాగానికి అధిపతి ఆయి-ఖగోళ శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రాలలోనే కాక – జీవశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఎంతో మంది పరిశోధకులను ప్రోత్సహించాడు. మొసపోటేమియా, గ్రీకు ప్రాంతాల నుండి వచ్చిన పరిశోధనల సారాంశాన్ని అర్థం చేసుకుని, వాటిని మెరుగుపరిచాడు. ఆర్యభట్ట గణిత శాస్త్రంలో ముఖ్యంగా అర్థమెటిక్ (అంకగణితం) ఆల్జీబ్రా (బీజగణితం) ప్లేన్ ట్రిగనామెట్రీ, స్పెరికల్ ట్రిగనామెట్రీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పవర్ సీరీస్, టేబుల్ ఆప్సైన్ వంటి వాటిని విస్తరించాడు.
అర్థం చేసుకోవల్సిన ముఖ్యమైన విషయమేమంటే, నాటి పరిశోధకులు, శాస్త్రవేత్తలు అందరూ బౌద్ధులే. వారి చిత్రపటాలకు నిలువుబొట్లు అడ్డంబొట్లు పెట్టి – వారు వైదిక మతస్థులయినట్లు ప్రచారం చేశారు. ఒక రకంగా వైజ్ఞానిక శాస్త్ర చరిత్రను కూడా బ్రాహ్మణీకరించిన ఘన చరిత్ర వైదిక మతస్థులదే – తర్వాత కాలంలో వచ్చిన బ్రహ్మ గుప్త (598 జ.జు) భాస్కర (476`550 C.E) వంటి వారంతా ఈ కోవలోని వారే. భాస్కరుడు ‘సిద్ధాంత శిరోమణి’ (1150 C.E)కరణ కుతూహలం (1177 – C.E) వంటి గ్రంథాలు రచించాడని తెలుస్తోంది. సిద్ధాంత శిరోమణి లోని తొలిభాగం ”శుద్ధగణితం” – దీన్నే తర్వాత కాలంలో ‘అంకగణితం’ అని అన్నారు. అదే లీలావతి గణితంగా ప్రసిద్ధి పొందింది. అయితే అంతకు ముందే 814 C.Eలో కర్నాటకు చెందిన వీరాచార్యుడు ‘గణిత సార సంగ్రహం’ అనే గ్రంథం రచించాడు. కవి తిక్కన మిత్రుడైన పావులూరి మల్లన్న ఇదే గణితసార సంగ్రహాన్ని చక్కటి పద్య కావ్యంగా తెలుగులోకి అనువదించాడు. ఈ విధంగా బౌద్ధులతో ప్రారంభించబడ్డ గణిత శాస్త్రం – వారి తర్వాత అదే పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులో కొచ్చింది.1965లో భవతీ తీర్థ అనే అతను ”వేదిక్ మేథమేటిక్స్” అనే గ్రంథం వెలువరించాడు. అబద్ధంతో సమాజాన్ని కలుషితం చేశాడు. ఆనాటి నుండి కొందరు ‘కుహనా గణిత శాస్త్ర వేత్తలు వేదగణితం పేరుతో ఉన్నవీ లేనివీ కలిసి – వ్యాపారం చేసుకుంటున్నారు. అందుకే, విషయాలు మూలాల్లోకి వెళ్లి గ్రహించడం అవసరం!
ఆ కాలంలో దేశంలో ఉన్నవి మూడు భాషలు – పాలి, ప్రాకృతం, సంస్కృతం. పాలి భాషను బ్రహ్మీలిపిలో రాసేవారు. జైనులు ప్రాకృతాన్ని ఉపయోగించే వారు. ఆనాటి ప్రజల భాష అయిన పాలి భాషలో బుద్ధుడు బోధనలు చేసేవాడు. ఈ భాషల్ని సంస్కరించుకుని ఏర్పరుచుకున్నదే సంస్కృతం. దీన్ని బ్రాహ్మణులే ఎక్కువగా ఉపయోగించే వారు. పైగా అది ప్రజలకు అందకుండా అడ్డుకునేవారు. ఆ రకంగా తమ ఆధిపత్యం కొనసాగాలని తాపత్రయ పడ్డారు. కానీ, ఆ కారణంగానే అది ప్రజలకు చేరువ కాకుండా క్షీణిస్తూ వచ్చింది. మరో ముఖ్యమైన విషయమేమంటే సంస్కృతం మాట్లాడటానికి పనికొచ్చేది మాత్రమే! రాసుకోవడానికి వీలయ్యేది కాదు. ఎందుకంటే అది లిపిలేని భాష. అయితే వారు, భారతదేశంలో చలామణిలో ఉన్న ‘నాగరి’ భాషలో రాసుకుని కాపాడుకున్నారు. దాన్నే ఉన్నతీకరించి ‘దేవనాగరి లిపి’ అని చెప్పుకున్నారు. ఏకంగా ఆ భాషను ‘దైవభాష’ అని కూడా ప్రచారం చేసుకున్నారు.
మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు. జైన మతాభిమాని. తరువాత వచ్చిన బిందు సాగుడూ అదే మతాన్ని అవలంభించాడు. ఆ తరువాత వచ్చిన అశోకుడే, బౌద్ధమతం స్వీకరించి – దాన్ని దేశంలో ఉధృతంగా ప్రచారం చేశాడు. తన కుమారుడు మహేంద్రను, కూతురు సంఘమిత్రలను శ్రీలంకకు పంపి, అక్కడ బౌద్ధం వ్యాపింపజేయడంలో చొరవ తీసుకున్నాడు. సర్వ మానవ సమానత్వ, సౌభ్రాతృత్వం, శాంతి, అహింస, వంటి బుద్ధుడి సూత్రాల్ని చక్రవర్తిగా అశోకుడు విస్తృతంగా ప్రచారం చేశాడు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు పెరిగాయంటే ఈ సూత్రాల వల్లనే – సాధారణ శకానికి పూర్వం 3వ శతాబ్దం (BCE)లో సమ్రాట్ అశోక్ మౌర్య చేసిన ప్రకటన ఇలా ఉంది. ”నా పుత్ర పౌత్రాదులు జీవించునంత కాలం, సూర్య చంద్రులు వెలుగొందునంత కాలం, బౌద్ధ ధమ్మం మహోజ్వలంగా భాసిల్లుతుంది బుద్ధుణ్ణీ, అతని ధమ్మ మార్గాన్నీ అనుసరించే ప్రజలు తమ జీవితాంతం సుఖశాంతులను పొందగలుగుతారు!!” యజ్ఞయాగాల వల్లగానీ, జంతుబలుల వల్లగానీ, వేద పురాణాల వల్ల గానీ, కల్పించుకున్న దేవీ దేవతల వల్లగానీ ఈ దేశప్రతిష్ట ప్రపంచంలో పెరగలేదు. పైగా అంధ విశ్వాసాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. సమకాలీనంలో కూడా మన దేశ నాయకులు ఇతర దేశాలకు వెళ్లినపుడు తాము ‘బుద్ధభూమి’ నుండి వచ్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా? తాము యుద్ధభూమి నుండి రాలేదని తమ శాంతి కాము కత్వాన్ని ప్రకటిస్తున్నారు కదా? తప్పదు – వారికి మరో మార్గం లేదు.
నాగార్జునుడి ‘శూన్యవాదం’లోని సారాన్ని పిండుకుని శంకరుడు అద్వైతాన్ని తయారు చేశాడంటారు. నిజం చెప్పాలంటే మహాయాన బౌద్ధం – మొదటి భాగమైతే, అద్వైతం- రెండవ భాగమవుతుంది! విశ్వంలో ప్రతిదీ పరస్పర ఆధారితం- ఏదీ స్వత సిద్ధం కాదు గనక, అంతా శూన్యమేననే నాగార్జునుడి వాదనను శమకరుడు ‘జగన్మిథ్య’గా మార్చుకున్నాడు. బుద్ధుడు బోధించిన నిర్మాణంతో ‘కార్యకారణ బంధ:’ అంతమవుతుంది. నిర్వాణం వైదిక పరిభాషలో ‘మోక్షం’ అయ్యింది. బ్రహ్మ మొక్కటే- అని తెలుసుకోవడమే మోక్ష సాధనం అంటాడు. శంకరుడు. అందువల్ల ఎంత నిరాకరించినా శంకరుడి ఆలోచనలు బౌద్ధంలోంచి వెలువడినవే ! ఆయనను ‘ప్రచ్చన్న బుద్ధు’ డన్నది కూడా అందుకే!
”బౌద్ధాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసే, ఇది హేతువు (కారణం/రుజువు)పై ఆధారపడి ఉందని స్పష్టమౌతుంది. ఏ ఇతర మతాలలో లేని సరళత బౌద్ధ జీవన విధానంలో మాత్రమే ఉంది” అని అన్నారు డా. బి.ఆర్. అంబేద్కర్:
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, (మెల్బోర్న్)నుంచి)
డాక్టర్ దేవరాజు మహారాజు