దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్మండలి(ఐసిసి) అధ్యక్షునిగా భారత క్రికెట్ కంట్రోల్బోర్డు(బిసిసిఐ) కార్యదర్శి జై షా ఎన్నిక దాదాపు ఖాయంగా కనబడు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్ క్లే (న్యూజిలాండ్) పదవీ కాలం నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు దఫాలుగా బార్ క్లే ఐసిసి అధ్యక్షునిగా ఉన్నారు. దీంతో బిసిసిఐ కార్యదర్శి జై షా ఆ పదవికి పోటీపడనున్నారు. మిగతా దేశాల బోర్డులనుంచి కూడా జై షాకు మద్దతు ఉండగా.. ఈ పదవికి పోటీపడేందుకు ఇప్పటివరకు మరొకరు దరఖాస్తు చేసుకోలేదు. మూడోసారి పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేనట్టు బార్ క్లే ఇప్పటికే ఐసిసి సభ్యులకు తెలియజేశాడు. ఈ నెల 27న ఈ విషయమై పూర్తి స్పష్టత రాబోతోంది. ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు 27 ఆఖరి తేదీ. ఐసిసి నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి మూడు పర్యాయాలు ఛైర్మన్గా ఉండొచ్చు. ఒక్కో టర్మ్కు రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తి గరిష్టంగా ఆరు సంవత్సరాలు ఐసిసి ఛైర్మన్ హోదాలో ఉండొచ్చు. 2020 నుంచి బార్ క్లే ఐసిసి ఛైర్మన్గా కొనసాగుతున్నాడు. ఐసిసి ఛైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 మంది సభ్యులు ఓట్లు వేయాల్సి ఉంది. వారిలో 9మంది ఓట్లు ఎవరికి పడితే వారు ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికవుతారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మెంబర్లతో సహా మిగిలిన దేశాల క్రికెట్బోర్డులు కూడా జై షా వైపే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం బిసిసిఐ కార్యదర్శిగా ఉన్న షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత అతడు తప్పనిసరిగా బిసిసిఐ పదవుల నుంచి మూడేళ్ల పాటు తప్పుకోవాలి. గతంలో భారత్కు చెందిన జగన్మోహన్ దాల్మియా(1997-2000), శరద్ పవార్ (2010-12) ఐసిసి ఛైర్మన్గా పని చేశారు. జై షా ప్రస్తుతం ఐసిసి ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.