మ్యూనిచ్‌ భద్రతా సదస్సులో జైశంకర్‌

మ్యూనిచ్‌ భద్రతా సదస్సులో జైశంకర్‌ అమెరికా, కెనడా మంత్రులతో భేటీ
– షేక్‌ హసీనాతో కూడా..
మ్యునిచ్‌ : జర్మనీలోని మ్యూనిచ్‌ పట్టణంలో జరుగుతున్న మ్యూనిచ్‌ భద్రతా సదస్సుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరయ్యారు. ఈ నెల 16న ప్రారంభమైన సదుస్సు 18వ తేదీ వరకూ జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా శనివారం అమెరికా రక్షణ మంత్రి అంటోని బ్లింకెన్‌తోనూ, కెనడా విదేశాంగ మంత్రి మిలైన్‌ జోలోతోనూ జైశంకర్‌ భేటీ అయ్యారు. బ్లింకెన్‌తో జరిగిన భేటీలో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు, భారత్‌-అమెరికా మధ్య దైపాక్షిక సంబం ధాలు వంటి అంశాలపై జైశంకర్‌ చర్చించారు. కాగా, కెనడా పౌరుడు నిజ్జార్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ఆరోపణల నేపథ్యంలో జైశంకర్‌- జోలో మధ్య భేటీ ప్రాధన్యత సంతరించు కుంది. ఈ హత్య తరువాత ఇరుదేశాల మంత్రు సమావేశం కావడం కేవలం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకు ముందు సెప్టెంబరులో ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ వివాదస్పద ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు వాషింగ్టన్‌లో సమా వేశం జరిపారు. మళ్లీ నాలుగు నెలలు తరువాత మ్యూనిచ్‌లో భేటీ అయ్యారు. ‘శనివారం సమావేశం లో మా ద్వైపాక్షిక సంబంధాల ప్రస్తుత పరిస్థితిపైనే దృష్టి పెట్టాం. అలాగే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడా నికి కూడా ఈ సమావేశం ఉపయోగపడింది’ అని సమావేశం తరు వాత జైశంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.
సెప్టెంబరు 19న కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌)లో మాట్లాడుతూ హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ‘విశ్వసనీ యమైన ఆరోపణలు’ ఉన్నాయని ప్రకటించారు. ఈ తరువాత భారత్‌-కెనడాల మధ్య ‘దౌత్య ఉద్రిక్తతలు’ నెలకొన్నాయి. దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకున్నా యి. భారత్‌ ఆతిధ్యం ఇచ్చిన జి-20 సమావేశా ల్లోనూ ట్రూడో భారత్‌పై బహిరంగంగా ఆరోపణలు చేశారు. అమెరికా కూడా ఈ అంశంలో తల దూర్చింది. దీంతో అమెరికా చేసిన ఆరోపణలపై దర్యాప్తు నకు భారత్‌ ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన విచారణ ఫలితాలను ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కాగా ఒకవైపు కెనడా, భారత్‌ మధ్య రాజకీయ సంబంధాలు ఉద్రిక్త తగా మారినా. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబం ధాలు మాత్రం యథావిధిగా కొనసాగుతుండటం విశేషం.
షేక్‌ హాసీనాతోనూ
మ్యూనిచ్‌ భద్రతా సదస్సుకు హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాతోనూ శనివారం జైశంకర్‌ సమావేశమయ్యారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మైత్రీ బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంపై ఈ సమావేశంలో ఇద్దరూ చర్చించారు. బంగ్లాదేశ్‌లో రికార్డు స్థాయిలో ఐదోసారి అధికారంలోకి వచ్చిన తరువాత షేక్‌ హసీనాతో సమావేశం కావడం జైశంకర్‌కు ఇదే మొదటిసారి. జనవరిలో బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి.