మినిమమ్‌ వేజ్‌ బోర్డు చైర్మెన్‌గా జనక్‌ ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

– మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మెన్‌గా బండ్రు శోభారాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మినిమమ్‌ వేజ్‌ బోర్డు చైర్మెన్‌గా సింగరేణి కార్మిక నాయకులు జనక్‌ ప్రసాద్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చిన జనక్‌ ప్రసాద్‌ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా బండ్రు శోభారాణి, ఎస్టీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా బెల్లయ్య నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. వారిద్దరికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ..మహిళల నైపుణ్య శిక్షణాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు.