సినిమాకు భాషతో, హద్దులతో సంబంధం లేదు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ‘జిగ్రా’ మూవీ. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ అంచనాలు దక్షిణాదికీ వ్యాపించనున్నాయి. మంచి సినిమాలకు తన వంతు మద్దతు తెలియజేసే హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హిందీ ట్రైలర్ విడుదలై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. కాగా తెలుగు ట్రైలర్ను హీరో రామ్చరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ సి.ఇ.ఒ అపూర్వ మెహతా మాట్లాడుతూ, ‘ప్రతిష్టాత్మక చిత్రమైన బాహుబలి, ఘాజి ఎటాక్ వంటి సినిమాలతో ధర్మ ప్రొడక్షన్స్తో రానా దగ్గుబాటికి మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ‘జిగ్రా’ తెలుగు విడుదల కోసం రానాతో, ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో చేతులు కలపటం గర్వంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలనే మా అంకితభావం మరోసారి దీంతో స్షష్టమవుతోంది. తెలుగు ప్రేక్షకులకు సుపరి చితురాలైన ఆలియా భట్తో పాటు వేదాంగ్ రైనా అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించ నుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చేయటానికి సమాయత్తమవుతున్నాం’ అని తెలిపారు. ‘ఈ కథలో మంచి సోల్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఎవరికైనా ఇది కనెక్ట్ అవుతుంది. ఇలాంటి వైవిధ్యమైన కథతో రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావించాం. అందుకనే ధర్మ ప్రొడక్షన్స్తో కలిసి నేను, ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. జిగ్రా అనేది కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. కుటుంబంలోని అనుబంధాలను తెలియజేసే చిత్రం. మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులను మనం ఎలా కాపాడుకోవాలో తెలియజెప్పే సినిమా’ అని రానా దగ్గుబాటి చెప్పారు.