జీవో 10ని వెంటనే రద్దు చేయాలి

– సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
– కలెక్టరేట్ ముందు దీక్షలు ప్రారంభం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అంగన్వాడి ఉద్యోగులను 65 సంవత్సరాల పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నలగొండ కలెక్టరేట్ ముందు దీక్షలు, మహా ధర్నా ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగుల సమస్యల తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరువధిక సమ్మె చేయడం జరిగిందని అన్నారు. ఆ సమ్మె సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని, పెన్షనర్లకు విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసిడిఎస్ మంత్రి సీతక్కకు, ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం  జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు, హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈ జీవో అమలు చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తక్కువ బెనిఫిట్ ఇచ్చి అన్యాయంగా తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతూ టీచర్కు రెండు లక్షలు హెల్పర్ కు లక్ష రూపాయలు పెన్షన్ 8000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పోరాటాన్ని దశలవారీగా జులై 10 నుండి 15 వరకు జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు 15,16 తేదీలలో 48 గంటలు ఎమ్మెల్యే ఇళ్ల దగ్గర ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు గత 40 సంవత్సరాల నుండి పిల్లలకు, తల్లులకు సేవలందించి అనేక అవార్డులు సంస్థకు తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తామని గొప్ప గొప్ప మాటలు చెబుతూ అంగన్వాడీలకు తీవ్ర అన్యాయానికి గురి చేశారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో జీవో 10 ద్వారా సుమారు 600 మంది అతి తక్కువ పెన్షన్తో రిటైర్ కావలసిన పరిస్థితి వచ్చిందని ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పునర్ ఆలోచన చేసి జీవో 10ని రద్దుచేసి టీచర్ కు రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి నెలకు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 10న అన్ని మండల ప్రాజెక్టు కేంద్రాలలో కోరికల దినంగా పాటిస్తూ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం డిఆర్ఓ రాజ్యలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిలు దండెంపల్లి సత్తయ్య చింతపల్లి బయన్న, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి. నాగమణి, ప్రధాన కార్యదర్శి బి. పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు మన్నెమ్మ ,పరిపూర్ణ, సహాయ కార్యదర్శి కే. రజిత జిల్లా నాయకులు యాదమ్మ , రాధా బాయ్, లక్ష్మి, ప్రమీల, సైదమ్మ, సునంద, సరిత, నాగమణి, స్వరాజ్యం, స్వప్న, అనిత, సుభాషిని, అరుణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, వరికుప్పల ముత్యాలు , ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.