– ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి/మహాదేవపూర్
జయశంకర్-భూపాలపల్లి జిల్లా పరిధి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మెన్ రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర గోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మేడిగడ్డ బ్యారేజ్లో మేజర్గా దెబ్బతిన్న 20వ నంబర్ పిల్లర్ను, పాక్షికంగా దెబ్బతిన్న 19, 21 పిల్లర్లను కమిషన్కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం సభ్యులు పరిశీలించారు. బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలినడకన సాగుతూ అణువణువూ పరిశీలించారు. ఏడవ బ్లాక్లో 20 పిల్లర్ దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని 19, 20, 21 పిల్లర్ల కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పిల్లర్ల కుంగుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మెన్ రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర గోష్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నట్టు చెప్పారు. ఇరిగేషన్ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజి పరిశీలించామన్నారు. పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఅండ్ఎం జనరల్ అనిల్ కుమార్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీఈ సుధాకర్ రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ, ఈఈ తిరుపతిరావు, ఎల్అండ్టీ ప్రాజెక్టు మేనేజర్ రజనీష్ తదితరులు పాల్గొన్నారు.