రాణించిన జురెల్‌

Jurel excelled– భారత్‌-ఏ 161 ఆలౌట్‌
మెల్‌బోర్న్‌ : వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (80, 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. ఆసీస్‌-ఏ పేసర్‌ మైకల్‌ నెసర్‌ దెబ్బకు టాప్‌ ఆర్డర్‌ కూప్పకూలింది. 11/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న జట్టును ధ్రువ్‌ జురెల్‌ ఆదుకున్నాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (26), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (16), ప్రసిద్‌ కృష్ణ (14) మాత్రమే రెండెంకల స్కోరు అందుకున్నారు. అభిమన్యు ఈశ్వరన్‌ (1), కెఎల్‌ రాహుల్‌ (4), సాయి సుదర్శన్‌ (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (4) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికారిక టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్‌-ఏ బౌలర్లు మైకల్‌ నెసర్‌ (4/27), వెబ్‌స్టర్‌ (3/19) విజృంభించారు. ఆసీస్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 53/2తో ఆడుతోంది. కామెరూన్‌ (3), శామ్‌ (1) అజేయంగా ఆడుతున్నారు. తొలి రోజు ఆట ముగిసిన సమయానికి ఆసీస్‌-ఏ మరో 108 పరుగుల వెనుకంజలో నిలిచింది.