చిట్యాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

నవ తెలంగాణ-మెదక్‌ టౌన్‌
ఫ్రీ లీగల్‌ ఎయిడ్‌”కి సంబంధించి న్యాయ విజ్ఞాన సదస్సు చిట్యాల గ్రామంలో నిర్వహించారు. లోక్‌ అదాలత్‌ గురించి వివరించారు. అసిస్టెంట్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కరుణాకర్‌ అడ్వకేట్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్‌ అంటే ఏమిటి పోలీస్‌ వారికీ ఏ విధంగా రిపోర్ట్‌ చేయాలి, పోలీస్‌ వారు రిపోర్ట్‌ను నిర్లక్ష్యంగా తీసుకోకపోతే ప్రైవేట్‌ కంప్లైంట్‌ ఏ విధంగా కోర్టులో వేయవచ్చు, న్యాయం ఏ విధంగా పొందవచ్చనే విషయాలను తెలిపారు. ప్రామిసరి నోట్‌ ఏ విధంగా వ్రాసుకోవాలి, కాల వ్యవది గురించి తెలియజేశారు. విక్రయ ఒప్పంద పత్రం అంటే ఏమిటి, ఏ విధంగా వ్రాసుకోవాలి, కాల వ్యవది గురించి తెలియజేసి రెగ్యులరేషన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 17, ఫోక్సో యాక్ట్‌ గురించి తెలియచేశారు. ఈ సదస్సులో కన్జ్యూమర్‌ ప్రొడక్షన్‌ యాక్టు 1986లో అమలులోకి వచ్చిందని తెలిపారు. వినియోగదారుల చట్టం, విత్తన చట్టం గురించి వివరిస్తూ రైతులు విత్తనాలు కొన్నప్పుడు వాటికి సంబంధించిన రసీదులు తీసుకోవాలని, విత్తనాలకు సంబంధించిన బ్యాగులను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. తద్వారా దిగుబడి సరిగ్గా రాకపోతే వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చని వివరించారు. లోక్‌ అదాలత్‌, బాలల హక్కులు, సంరక్షణ, సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్స్‌, ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. పరస్పర ఒప్పందంతో లోక్‌ అదాలత్‌లో సమస్యలు సత్వరమే పరిష్కరించబడతాయని వివరించారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిద్దా గౌడ్‌ మాట్లాడుతూ భూమి యజమాని హక్కులు, విత్తన చట్టముల లాభము ఉపయోగాలు, వినియోగదారుల హక్కుల చట్టము, బాల్య వివాహల వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ నందు భూమికి సంబందించిన కేసులు, రోడ్డు ప్రమాదం కేసులు, ఆస్తి తాగాదా కేసులు, బ్యాంకు కేసులు, భార్య భర్తల కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకునే సౌకర్యం ఉంటుందన్నారు. ఈ సదస్సులో అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ మెదక్‌ సిద్ధాగౌడ్‌, సిద్దిరాములు, చిట్యాల పంచాయతీ కార్యదర్శి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.