– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
– భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో పేదలు నిర్మించుకున్న ఇండ్లకు గృహ ప్రవేశం
నవతెలంగాణ-భిక్కనూర్
ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో పేదలు ఇండ్లు నిర్మించుకున్న ‘మల్లు స్వరాజ్యం కాలనీ’లో నూతన ఇండ్లకు గృహప్రవేశం చేశారు. అనంతరం సభ జరుగుతున్న స్టేజ్పైనే నుంచే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వెంకట్ ఫోన్చేసి మల్లు స్వరాజ్యం కాలనీలో నివసిస్తున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వెంకట్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన రూ.5లక్షలను జంగంపల్లి గ్రామస్తులైన మల్లు స్వరాజ్యం కాలనీలో నివసిస్తున్న వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కొనుగోలు చేసిన భూమిని 2008లో ఎర్రజెండా పోరాట ఫలితంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చి స్థలాలు చూపించిందన్నారు. వాటిలో రెండు సంవత్సరాలుగా జంగంపల్లి ప్రజలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడన ఇండ్లను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. భూ పోరాటాలకు ఎల్లవేళలా వ్యకాస ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
రైతుబంధు పథకంలా కూలీబంధు పథకాన్నీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. పట్టాలు ఉండి ప్రభుత్వం చూయించిన స్థలాల్లోనే నివాసం ఉంటున్న వారి జోలికి రావద్దని హైకోర్టు ఆర్డర్ ఉందన్నారు. పేద ప్రజల జోలికి వస్తే ఎర్రజెండా ఊరుకోదని స్పష్టంచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్గౌడ్, సీఐటీయూ జిల్లా నాయకులు సురేష్ గొండ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు, నాయకులు పేరం నరసభ, నారాయణ, రుద్ర బోయిన నర్సింలు, ప్రవీణ్, దేవరాజ్, జయ పాల్గొన్నారు.