బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎం : భట్టి విక్రమార్క

నవతెలంగాణ ఖమ్మం: బీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని విమర్శించిన బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఇంకా కొనసాగుతుందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ… ‘నియంతృత్వ పాలకుల మీదే తిరుగుబాటు ఉంటుంది. మాది ప్రజాస్వామ్య పాలన.. మాపై తిరుగుబాటు ఉండదు. ఇప్పుడే ప్రజలు, అధికారులు స్వాతంత్ర్యం వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుంది. ఎవరిపైనా ఒత్తిడిలేని పాలన కొనసాగిస్తాం’’అని భట్టివిక్రమార్క తెలిపారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ప్రపంచీకరణకు అనుగుణంగా వర్సిటీలో కోర్సులు పెడతామని ఆయన  వివరించారు.