నేటి నుంచి కేసీఆర్‌ బస్సుయాత్ర

– తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ప్రారంభం : మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్‌షో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర చేపట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్‌లో ఆయన బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఆ యాత్ర ఉప్పల్‌, ఎల్బీనగర్‌, చౌటుప్పల్‌, నకిరేకల్‌ ఎక్స్‌రోడ్‌, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడకు ఆయన చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడ టౌన్‌లో భారీ రోడ్‌షోలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి, తిప్పర్తి, నార్కెట్‌పల్లి బైపాస్‌రోడ్డు, కేతేపల్లి మీదుగా సూర్యాపేట పట్టణానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి ఏడు గంటలకు నిర్వహించే భారీ రోడ్‌షోలో పాల్గొంటారు. తొలిరోజు ఆయన 184 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర చేయనున్నట్టు తెలిసింది.