నేడు కేసీఆర్‌ డిశ్చార్జి

KCR– మాజీ స్పీకర్‌ పోచారం సహా పలువురి పరామర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఆయన అక్కడి నుంచి నందినగర్‌లో గల తన సొంత ఇంటికి వెళ్లనున్నారు. కేసీఆర్‌కు ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన మరి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. మరో వైపు గురువారం కూడా ఆయన్ను పలువురు పరామర్శించారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనినాస్‌ రెడ్డి, సినీ నటుడు నరేశ్‌, పెద్దమ్మ తల్లి దేవస్థానం చైర్మెన్‌ విష్ణువర్థన్‌ రెడ్డి, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌, నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మెన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి తదితరులు కేసీఆర్‌ ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.