ఖమ్మం, వరంగల్‌ రైల్వే అలైన్‌మెంట్‌ మార్చండి

– ద..మ. రైల్వే జీఎంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న ఖమ్మం-వరంగల్‌ జిల్లాల రైలుమార్గాల అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారంనాడిక్కడి రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌జైన్‌తో భేటీ అయ్యారు. డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్‌గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుంచి గద్వాల్‌ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలోని నాలుగు మండల మీదుగా వెళ్తుందనీ, దీనివల్ల సాగుభూములను రైతులు కోల్పోవలసి వస్తుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్‌మెంట్‌లో మార్పుచేసి, మరో మార్గంలో రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని వరంగల్‌ నగర బైపాస్‌ రైల్వేలైన్‌ను నిర్మించాలని కోరారు. వరంగల్‌ నగర భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2050నాటికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అందువల్ల రైల్వేశాఖ నష్కల్‌ నుంచి హసన్‌పర్తి, నష్కల్‌ నుంచి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌కు అనుసంధానం చేయాలని కోరారు. ప్రస్తుతం సిద్దం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌ దెబ్బతింటుందనీ, అందువల్ల అలైన్‌మెంట్‌ మార్చాలని కోరారు. సమావేశములో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.