కేకేకు మతిభ్రమించింది

– మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ను మోసం చేసి కాంగ్రెస్‌కు జై కొట్టిన ఎంపీ కేశవరావుకు మతిభ్రమించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత రసమయి బాలకిషన్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రసమయి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఎద్దేవా చేశారు. మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా కేకేను కోడిగుడ్లతో కొట్టిన సంఘటనలు తనకు ఇంకా గుర్తే ఉన్నాయన్నారు. ఆయన భాష ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. అలాంటి కేకే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మాట లేదు.. పాట లేదు అంటూ వ్యాఖ్యానించటం ఆయన అహంభావానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి వైఖరి వల్లే బీఆర్‌ఎస్‌ నుంచి తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాదిగల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్లో కడియం శ్రీహరిపై చావు డప్పు కొట్టాలని పిలుపునిచ్చారు. శ్రీహరిని ఓడగొట్టి పాతిపెట్టే వరకు తాను గజ్జె కట్టి ఆడతానని హెచ్చరించారు.