పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పి సీఈవో శోభారాణి మున్సిపల్ చైర్మన్ పొతంశెట్టి వెంకటేశ్వర్లు తో కలసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రజాపాలన లో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు.లబ్ధిదారులకు ప్రాధాన్యతా పరంగా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.పట్టణాలు , గ్రామాల, వార్డులలో గ్రామ సభలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.రేపు అన్ని సంక్షేమ వసతి గృహాలలో నూతన డైట్ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక,ఆర్థిక, విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వే అధికారులు విజయవంతంగా నిర్వహించారని అదే స్ఫూర్తితో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ మొబైల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఎన్యుమరేటర్లను నియమించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఈఐఈ నాగేశ్వరరావు,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హౌసింగ్ శ్రీరాములు, మండల తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.