సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ దర్శకుడు రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్లో ‘పెళ్లిపుస్తకం’ తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ, కథనాలు కనెక్ట్ అవుతాయి. ఇదొక విందు భోజనం లాంటి సినిమా’ అని చెప్పారు.
‘పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు. రెండు మనసులు కలవడం. అదే ఈ సినిమా. రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుంచే ఆరంభం చేస్తున్నాం’ అని దర్శకుడు రమేష్ చెప్పాల అన్నారు.
‘ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుంది. పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది’ అని హీరో సాయి రొనక్ తెలిపారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.