– కాంగ్రెస్ను జిన్నా ముస్లిం లీగ్తో పోల్చిన మోడీ
న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాని మోడీలో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఒక వైపు దాడులు చేయిస్తూ, మరొక వైపు ప్రతిపక్షాలపై బురదచల్లే కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. శనివారం షహరాన్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోపై తీవ్రంగా విచుచుకుపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు జిన్నా ముస్లిం లీగ్ భావజాలంతో పోల్చి విభజన రాజకీయాలకు ఆజ్యం పోసే ప్రయత్నం చేశారాయన. ఈ కాంగ్రెస్ 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళదని ఆక్రోశించారు…” వామపక్షాలపైనా అక్కసు వెళ్లగక్కారు. ‘ఇండియా’ వేదిక నాయకులపైనా రుసరుసలాడారు. ఈ వేదికలో చాలా మంది నాయకులున్నారు. వారి దృష్టి అంతా ప్రధాని కుర్చీపైనేనని మోడీ ఆరోపించారు. వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ తమ మ్యానిఫెస్టోలో దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి నొక్కిచెప్పాయి. మరోవైపు ప్రజా ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చాయి.. ప్రజాస్వామంమంచ సమాజంలోని అన్ని వర్గాలు పౌర హక్కుల పరిరక్షణకు పిలుపునిచ్చాయి. మోడీ అక్కసుకు ఇదే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు.
స్వాతంత్య్ర పోరాటం నడిపిన కాంగ్రెస్ దశాబ్దాల క్రితం నాటిదని, నేటి కాంగ్రెస్కు దేశానికి దిశా నిర్దేశం చేసే విజన్ ఏమీ లేదని ఆయన ఆరోపించారు. వామపక్షాలను కూడా మోదీ లాగుతూ, ముస్లిం లీగ్ ఆలోచన తర్వాత , ఆ స్థానంలో వామపక్షాల ఆలోచన చొరబడిందంటూ విషం గక్కారు.
కమ్యూనిస్టులపై దాడి ఇదే మొదటి సారి కాదు. గత సంవత్సరం ఆరెస్సెస్ వ్యవస్థాపక దినమైన ‘విజయ దశమి’ నాడు ఆ సంస్థ అధిపతి మోహన్ భగవత్ మాట్లాడుతూ, ” ప్రస్తుతం దేశానికి ప్రధాన శత్రువు సాంస్కతిక మార్క్సిస్టులే” అంటూ చిందులేశారు. ప్రతిపక్షాలు మైనార్టీల హక్కుల గురించి డిమాండ్ చేసినప్పుడల్లా ” ముస్లింలను బుజ్జగిస్తున్నారు” అంటూ బిజెపి, ఆరెస్సెస్ విరుచుకుపడుతున్నాయి. కొన్నిసార్లు నిరసనకారులను తుక్డే తుక్డే గ్యాంగ్లని, వారు సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని ఆరోపించాయి. ఈసారి మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ని నేరుగా లాగారు. జిన్నా విషయాన్ని అలా ఉంచితే, స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర ఏమిటో మోడీ మహాశయుడు సెలవిస్తే బాగుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
‘ఇండి’ బ్లాక్ అనిశ్చితికి, అస్థిరతకు పర్యాయపదం” అని, . ప్రజలు కూడా వాటిని పట్టించుకోవడం లేదని మోడీ విమర్శించారు.
మోడీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నేతలు స్పందిస్తూ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోడీ ఇటువంటి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. ‘ఇండియా’ వేదిక మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో నిర్వహించిన ర్యాలీకి పెద్దయెత్తున జనం రావడంతో. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు బెంబేలెత్తుతున్నాయన్నారు.