శాసన సభ సమావేశాలు

– 30 రోజులు నడపాలి : రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తామని చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌రావును హోంగార్డులు కలిశారు. తమ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి శిష్యుడు కిషన్‌రెడ్డి అంటూ వస్తున్న వార్తలకు కౌంటర్‌ ఇస్తూ కేసీఆర్‌ సంజరుగాంధీకి శిష్యుడు కాదా? అని ప్రశ్నించారు. నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైన శిష్యుడిగా ఉండొచ్చన్నారు. ఇక్కడ పనిచేయనోళ్లు మహారాష్ట్రలో ఏం చేస్తరు? అని నిలదీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలు చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరమన్నారు. మంద బలం ఉంది కదా? 30 రోజులు సభ నడపలేరా? అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికు లు ఇలా అన్ని రంగాల వారినీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌ లో అమ్మిన భూములు ఎంత? దాని విలువ ఎంత? ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ? అనే అంశంపై చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ విసిరారు.