ఆశాలకు లెప్రసీ, పల్స్‌పోలియో పెండింగ్‌ డబ్బులివ్వాలి

– ఆ తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి : వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆశాలకు లెప్రసీ సర్వే, పల్స్‌పోలియో పెండింగ్‌ డబ్బులను వెంటనే చెల్లించాలనీ, ఆ తర్వాతనే వారితో కొత్త సర్వేలు చేయించాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్‌.నీలాదేవి, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసు మాధవి, కోశాధికారి పి.గంగమణి డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఈ మేరకు వైద్యారోగ్య కమిషనర్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో ఆశాలు 2023, 2024లో లెప్రసీ సర్వే, 2024లో పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారనీ, వాటికి సంబంధించి ఇప్పటివరకూ డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. రాష్ట్ర కేంద్రంలోని అధికారులేమో సర్వేల డబ్బులు విడుదల చేశామని చెబుతున్నారనీ, ప్రోసీడింగ్‌ ఆర్డర్‌ ఇచ్చినంత మాత్రాన డబ్బులు చెల్లించినట్టు కాదనీ, ఇంకా రాలేదని జిల్లా అధికారులు చెబుతున్నారని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఆశాలు నలిగిపోతున్నారని వాపోయారు. పాత సర్వేలు, పల్స్‌పోలియో డబ్బులే ఇవ్వలేదుగానీ కొత్తగా మళ్లీ లెప్రసీ సర్వే చేయాలని ఆశాలపై ఒత్తిడి చేయడమేంటి? వారికి ట్రైనింగ్‌ ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు.