– ఎన్నికల షెడ్యూల్ రాకతో రాష్ట్రంలో రాజకీయ కాక
– 50 రోజులపాటు ఎలక్షన్ హీట్
– పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యాచరణ
– ఇప్పటికే అధికార పార్టీ తొలి జాబితా
– బస్సు యాత్రల సన్నాహాలు, సమావేశాలతో హస్తం బిజీబిజీ
– అయోమయంలో కమలం-స్పష్టమైన వైఖరితో వామపక్షాలు
బి.వి.యన్.పద్మరాజు
ఎన్నికల షెడ్యూల్ రాకతో ‘ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క…’ అన్నట్టుగా మారాయి రాష్ట్ర రాజకీయాలు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది కాలంగా విమర్శలు, ప్రతి విమర్శలు..ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణ, భాషణలతో తలపడిన అధికార, ప్రతిపక్ష పార్టీలు… ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలో తలపడనున్నాయి. ఈ క్రమంలో దాదాపు 50 రోజులపాటు అవి ప్రచారంతో రాష్ట్రాన్ని హోరెత్తించనున్నాయి. అటు జాతీయ స్థాయి నేతలు, ఇటు రాష్ట్ర నాయకుల సభలు, సమావేశాలతో తెలంగాణ హీటెక్కనుంది. ఎన్నికల ప్రణాళికలు, హామీలు, వాగ్దానాల పరంపర కొనసాగనుంది.
అందరూ ఊహించినట్టుగానే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. దీంతో ఇటు రాజకీయ పార్టీలతోపాటు అటు నేతల్లో టెన్షన్ మొదలైంది. అభ్యర్థుల బలాబలాలు, గెలుపోటములపై చర్చోప చర్చలు జరుగుతుండగా… ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుపోతున్నది. అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఎన్నికలను ఎదుర్కొనేందుకు రె’ఢీ’ అయ్యింది.
అంగబలం, అర్థబలం దండిగా ఉన్న బీఆర్ఎస్… 115 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను ప్రకటించిన సంగతి విదితమే. ఫలితంగా నెలకొన్న అసంతృప్తులు, బుజ్జగింపుల పర్వం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు అధికారిక, అనధికారిక కార్యక్రమాల పేరిట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పుడు ఆ పర్యటనల ఉధృతి ఎక్కువ కానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ట్రబుల్ షూటర్ హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత వివిధ కార్యక్రమాల పేరిట ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చారు. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది కాబట్టి వారు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దాంతోపాటు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్, నామినేషన్ దాఖలు తేదీ కూడా ఖరారయ్యాయి.
హస్తం జోరు…
కర్నాటక ఎన్నికల ఫలితాలతో జోష్ నింపుకున్న రాష్ట్ర కాంగ్రెస్… బీఆర్ఎస్తో ఢీ అంటే ఢ అనే విధంగా ఇటీవల కార్యక్రమాలను నిర్వహించింది. కొద్ది నెలల క్రితం వరంగల్లో రైతు డిక్లరేషన్, ఆ తర్వాత సరూర్నగర్లో నిరుద్యోగ సభ, సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించి, తుక్కుగూడలో విజయభేరీ సభను ఏర్పాటు చేయటం ద్వారా ఆ పార్టీ తన క్యాడర్లో జవసత్వాలను నింపింది. ఇటీవల చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహించి, ఆయా సామాజిక తరగతులను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించి, అందులో సఫలీకృతమైంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలకు రంగం సిద్ధం చేయటం ద్వారా ప్రజల్లోకి వెళ్లనుంది. మరో ఐదారు రోజుల్లో తొలి జాబితాను ప్రకటించి, ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
బీజేపీ డీలా…
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల గోదాలోకి దిగగా…కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం రాష్ట్రంలో డీలా పడింది. కర్నాటక అసెంబ్లీ ఫలితాలు ఆ పార్టీపై పెను ప్రభావాన్ని చూపాయి. దానికితోడు నేతల మధ్య సఖ్యత లేకపోవటం, అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ సతమతమవుతోంది. బీజేపీలోని పాత కాపులు, కొత్త నేతల మధ్య ఆధిప్యత పోరు తారాస్థాయికి చేరటంతో ఇటీవల పలువురు సీనియర్లు కమలాన్ని వీడారు. ఈ కారణాలన్నింటితో బీజేపీ పరిస్థితి మరింతగా దిగజారింది. ఈనెల 15,16 తేదీల్లో తొలి జాబితాను ప్రకటిస్తామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అది కూడా కమలంలో జోష్ నింపుతుందన్న గ్యారెంటీ లేదు.
ఇక తెలంగాణ జన సమితి, వైఎస్సార్ టీపీ, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీల పరిస్థితి అయోమయంగానే ఉంది. ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పోటీ చేయని స్థానాల్లో ఎవరికి మద్దతిస్తారనే దానిపైనా క్లారిటీ లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్లో వైఎస్సార్ టీపీ విలీనం గురించి చర్చలు, మంతనాలు జరిగినా పలు సమీకరణాల రీత్యా అది వాయిదా పడుతూ వస్తోంది. బీఎస్పీ, బీఎల్ఎఫ్లు ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన సంగతి విదితమే. సీపీఐ (ఎం), సీపీఐలు తమ రాజకీయ వైఖరిని స్పష్టం చేశాయి. దేశానికి బీజేపీ మతోన్మాద ప్రమాదాన్ని నివారించటమే లక్ష్యంగా సాగుతున్న వామపక్షాలు పోటీ చేయబోయే స్థానాలపై త్వరలోనే స్పష్టత రానుందని సమాచారం.