బీజేపీని గద్దెదించుతాం

బీజేపీని గద్దెదించుతాం పాత పెన్షన్‌ పునరుద్ధరించకుంటే ఉద్యమం ఉధృతం
– రాంలీలా ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం నేతల హెచ్చరిక
– కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయాలి
– కదంతొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు
–  మోడీ ప్రభుత్వాన్ని ఓడించటమే తక్షణ కర్తవ్యం :తపన్‌ సేన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే లోక్‌సభ ఎన్నికలలోగా జాతీయ పెన్షన్‌ పథకాన్ని (ఎన్పీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నేతలు హెచ్చరించారు. కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడిక్కడ రాంలీలా మైదానంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ (సీసీజీఈడబ్ల్యూ), ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌జీఈఎఫ్‌), స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ), ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ జీపీఎఫ్‌), నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్ల అసోసియేషన్‌ (ఎన్సీసీపీఏ) సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన చేతావనీ ర్యాలీలో దేశ నలుమూలల నుంచి వేలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొన్నారు. ”ఎన్పీఎస్‌ రద్దు చేయాలి, ఓపీఎస్‌ పునరుద్ధరించాలి, ఎన్‌ఈపీని వెనక్కి తీసుకోవాలి” అంటూ డిమాండ్‌ చేస్తూ ఇంగ్లీష్‌, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో డిమాండ్లతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు చేబూని దేశ రాజధాని ఢిల్లీల్లో కదంతొక్కారు. మోడీ సర్కార్‌ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు హౌరెత్తించారు. అనంతరం ఉద్యోగ సంఘ నేత సుభాష్‌ లాంబ, ఉపాధ్యాయ సంఘం నేత సిఎన్‌ భార్తి అధ్యక్ష వర్గంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, పెన్షన్‌ ప్రయివేటీకరణకు మూలకారణమైన మోడీ ప్రభుత్వాన్ని ఓడించటమే తక్షణ కర్తవ్యం అని అన్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ. శ్రీకుమార్‌ మాట్లాడుతూ పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వారిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) అధ్యక్షుడు కె ఎస్‌ హరికృష్ణ మాట్లాడుతూ విద్యలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణలకు దోహదపడుతున్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నేతలు ఎస్బి యాదవ్‌, రూపక్‌ సర్కార్‌, సిఎన్‌ భారతి, అశోక్‌ తులే, కె రాఘవేంద్రన్‌ మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఎస్టీఎఫ్‌ఐ అనుబంధ సంఘం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు చలో ఢిల్లీలో పాల్గొన్నారు. ఎస్టీఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు, టీఎస్‌ యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం. సంయుక్త, రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, ఉపాధ్యక్షులు సిహెచ్‌ దుర్గాభవాని, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతికుమారి, నాగమణి, రవికుమార్‌, మాణిక్‌ రెడ్డి, వెంకటప్ప, వెంకటేష్‌, గోపాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.