మతోన్మాదాన్ని ఐక్యంగా తరిమికొడదాం

 Let's fight bigotry together– అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మెన్‌ విమలక్క
– మణిపూర్‌ ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజాప్రదర్శన సదస్సు
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
మణిపూర్‌ మంటలకు కారణమైన మతోన్మాదాన్ని ఉపేక్షిస్తే మనదాకా వస్తుందని, దాన్ని ఐక్యంగా తరిమికొట్టాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మెన్‌ విమలక్క అన్నారు. మణిపూర్‌ మహిళలపై ఆకృత్యాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజాప్రదర్శన నిర్వహించారు. సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జెవి.చలపతిరావు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం గాజుల మల్లయ్య కల్యాణ మండపంలో గొట్టే రుక్మిణి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. మణిపూర్‌ విధ్వంసం కుట్రపూరితంగానే జరిగిందన్నారు. కలిసిమెలిసి ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి హింపాకాండకు కారణమైన పాలకులపై ఎలాంటి చర్యలూ లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌, నాగాలాండ్‌తో మొదలై దేశం మొత్తం మీద విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోకపోతే మనదాకా వచ్చే ప్రమాదం ఉందన్నారు. సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జెవి చలపతిరావు మాట్లాడుతూ.. ఉన్మాదంతో అధికారంలోకి రావాలని బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గుజరాత్‌లో ఏం జరిగిందో ఆలోచిస్తే.. దేశ మొత్తం మీద అలాంటి ఫార్ములానే ప్రయోగిస్తున్నారని అర్థమవుతుం దన్నారు. ఇది దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ లక్ష్మి మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘటన వెనుక మూలాలను అర్థం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మణిపూర్‌ ఆకృత్యాలపై సదస్సు పలు తీర్మానాలు చేసింది. అరుణోదయ కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు రాగుల రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముషం రమేష్‌, గుంటి వేణు బోజ్జ కనకయ్య, చేన్నమనేని పురుషోత్తం రావు, గుండా థామస్‌, దోసల చంద్రం, కంచర్ల రవి గౌడ్‌, మార్వాడి గంగరాజు, సాయికుమార్‌, సౌమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.