– ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – హయత్ నగర్
ప్రాచీన కాలంలోనే అనేక తెలుగు సాహిత్య ప్రక్రియలు తెలంగాణలోనే ప్రారంభం అయ్యాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్లో ”తెలంగాణ అస్తిత్వ పోరాట సాహిత్యం సమాలోచన” అనే అంశం మీద రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక తెలుగు సాహిత్య ప్రక్రియలు తెలంగాణలోనే ప్రారంభం అయ్యాయని, అవి అనంతరకాలంలో తెలుగు ప్రాంతాలన్నింటికీ విస్తరించాయని దాదాపు 25 తెలుగు సాహిత్య ప్రక్రియల గురించి వివరించారు. నిజాం ఏలుబడిలో జరిగిన పోరాటాల సమయంలో వచ్చిన సాహిత్యం, రైతాంగ పోరాట కాలం నాటి సాహిత్యం, తెలంగాణ ఉద్యమం తొలి, మలిదశ కాలాల నాడు వచ్చిన సాహిత్యాల గురించి కూడా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జోత్స్నప్రభ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభ సమావేశానికి కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ డి. రాజేందర్ సింగ్, జి. యాదగిరి, ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకరశర్మ, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కే. లావణ్య, సేవారత్న శ్రీ నక్క శ్రీనివాస్యాదవ్ హాజరయ్యారు. కళాశాల సదస్సు కన్వీనర్, డాక్టర్ కె సురేశ్, సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ చింతల రాకేశ్ భవాని, డాక్టర్ గంజి శశిధర్, శ్రీమతి సరస్వతి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు, వివిధ కళాశాలల నుండి పత్రసమర్పణ చేయడానికి వచ్చిన అధ్యాపకులు, సాహిత్య అభిమానులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.