రుణాలు ప్రియం

–  వడ్డీ రేట్లు పెంచిన పలు బ్యాంక్‌లు
న్యూఢిల్లీ : రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిర్ణయం తీసుకున్నాయి. ఆర్‌బిఐ రెపోరేటును యథాతథంగా కొనసాగించాలని గురువారం నాటి ఎంపిసి భేటీలో నిర్ణయించినప్పటికీ.. నిధుల ఆధారిత రుణ రేట్ల (ఎంసిఎల్‌ఆర్‌)ను 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచాలని మూడు బ్యాంక్‌లు భావించాయి. వీటిలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌తో సహా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. ఏడాది కాలపరిమితి ఎంసిఎల్‌ఆర్‌ను 8.65 శాతం నుంచి 8.70 శాతానికి చేర్చినట్లు బిఒబి తెలిపింది. కెనరా బ్యాంక్‌ కూడా 5 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.70 శాతంగా నిర్ణయించింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 10 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.50 శాతం నుంచి 8.60 శాతానికి చేర్చింది.