రామ్ గోపాల్ వర్మ నిర్మించిన లేటెస్ట్ థ్రిల్లర్ ‘శారీ’. ఆర్జీవీ డెన్ ద్వారా ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే ట్యాగ్లైన్తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో సైకలాజికల్ థ్రిల్లర్గా ఇది తెరకెక్కింది. గిరి కష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్లో బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి జంటగా నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ మంచి ఫ్యాన్సీ రేట్తో థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ‘ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయానకమైన రిలేషన్స్కి తెర తీస్తోంది. సోషల్ మీడియా అనేది జనానికి మేలు చేయకపోగా ‘యాంటీ సోషల్ మీడియా’గా మారుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల ద్వారా చాలామందిలో విచ్చల విడితనం పెరిగిపోతోంది. యువతులు వాటిలోని నిజాలను గ్రహించలేక ఆకర్షితులవు తున్నారు. మితిమీరిన ప్రేమ ఎంత భయంకరంగా మారొచ్చు అనేది ఈ చిత్రంలోని ప్రధాన అంశం. వయసులో ఉన్న అమ్మాయిలకు కనువిప్పు కలిగేలా ఈ సినిమా తెరకెక్కింది’ అని అన్నారు. ‘ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రక్రియతో రికార్డు చేసిన ‘ఐ వాంట్ లవ్’ అనే లిరికల్, ఫుల్ వీడియో సాంగ్ ఆర్జీవీ డెన్ మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో లిరికల్ సాంగ్ విడుదల చేస్తాం. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత రవి వర్మ చెప్పారు.