‘మహానటి’, ‘సీతారామం’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న తర్వాత హీరో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దుల్కర్ సల్మాన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘శ్రీమతి గారు’ గీతం, టైటిల్ ట్రాక్తో పాటు, టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం, డబ్బింగ్ సహ అన్ని సాంకేతిక విభాగాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నట్లు తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి భాషలో మాత భాష అనుభూతిని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబయిని పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన అద్భుత పనికి అవార్డులు అందుతాయని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి కెమెరా పనితనం దర్శకుని ఊహకు ప్రాణం పోసింది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. మరో జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.