విద్యార్థులకు మధ్యాహ్నo ఇంటి భోజనమే

నవతెలంగాణ- రామారెడ్డి

మధ్యాహ్న భోజన నిర్వాహకులు, పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, మిస్ చార్జీలు పెంచాలని తమ డిమాండ్ల కోసం సమ్మెకు వెళ్లగా, విద్యార్థులు ఇంటి నుంచే మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లి భోజనం చేస్తున్నారు. మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు వసతి గృహము నుండి పాఠశాల దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఉండటం, మధ్యాహ్నం ఒక గంట లోపల నడుచుకుంటూ వెళ్లి, భోజనం చేసి మళ్ళీ తిరిగి రావాలంటే ఇబ్బందిగా ఉందని, సమయం సరిపోవటం లేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహం విద్యార్థులకు భోజనం పాఠశాలలోనే అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం సమ్మెను దృష్టిలో ఉంచుకొని, పాఠశాలలో విద్యార్థుల భోజన దృశ్యాలను తీయకుండా ప్రధానోపాధ్యాయులకు సూచించినట్లు రామారెడ్డి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజులు, తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాను దూరం ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.