అసెంబ్లీలో పూలే విగ్రహానికై 12న మహాధర్నా

– ఈ నెల 6 నుంచి 10 వరకు ఉమ్మడి జిల్లాలవారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు
నవతెలంగాణ-  కంటేశ్వర్
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించనుంది. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరగనున్న ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు, మెధావులు, ప్రొఫెసర్లకు భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మరోవైపు, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి గానూ ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. జిల్లాల్లో జరిగే అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతారు. 6న తేదీన ఉదయం  వరంగల్ లో, మధ్యాహ్నం కరీంనగర్ లో, 7వ తేదీన ఉదయం వికారాబాద్ లో, మధ్యాహ్నం మహబూబ్ నగర్ లో, 8వ తేదీన ఉదయం ఆదిలాబాద్ లో, మధ్యాహ్నం నిజామాబాద్ లో, 9వ తేదీన ఉదయం ఖమ్మంలో, మధ్యాహ్నం నల్గొండలో, 10వ తేదీన సంగారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అన్నింటికి ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ఇతర ప్రముఖులను రౌండ్ టేబుల్ సమావేశాలకు యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.