రాష్ట్ర అవసరాలకు సరిపడా ప్రణాళిక రూపొందించండి

Make a plan adequate to the needs of the state– విద్యుత్‌ సంస్థలకు విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యాన్ని అభివద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరుగనున్న రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో విద్యుత్‌ కొరత లేకుండా ఉండేందుకు రామగుండం ఎన్టీపీసీ ఫేజ్‌-2 లో 2400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం ఆ సంస్థతో సంప్రదింపులు జరపాలని సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పనులను చేపట్టాలని ఆదేశించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, తొలి విడతలో 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మాణం చేస్తున్నదని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్‌ కో ఇంచార్జ్‌ సిఎండి సయ్యద్‌ ముర్తుజా రిజ్వీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.