– రైతుసంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
ఇల్లు లేని నిరుపేదల కోసం ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం ఈనెల 26న తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటలు బాలరాజు అన్నారు. గురువారం స్థానిక ఏసీరెడ్డి భవనంలో ప్రజాసంఘాల పోరాట వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచినప్పటికీ పేదలకు ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. పేదలకు సరిపడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించకపోవడం వల్ల పేదల సొంతింటి కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికీి 125 గజాల స్థలాన్ని పట్టా చేసి ఇవ్వాలని, బీడీ కార్మికులకు ఏ లాంటి షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలని, రుణమాఫీని ఏక కాలంలో చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ , కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, సీఐటీయూ మండల కన్వీనర్ మోరిగాడి రమేష్ , వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జూకంటి పౌలు, రైతు సంఘం మండల కార్యదర్శి సూదగాని సత్య రాజయ్య, డీివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్ , సీఐటీయూ మండల కన్వీనర్ సంఘీ రాజు ,రైతు సంఘం నాయకులు ఘనగాని మల్లేశం,వడ్డేమాన్ బాలరాజు ,కటికం సుదర్శన్, కల్లుగీత కార్మిక సంఘం మండల కార్యదర్శి మిట్ట శంకరయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.