– ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథమెటిక్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్-2 పరీక్షను నిర్వహించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,68,531 మంది దరఖాస్తు చేయగా, 4,54,323 (96.97 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 14,208 (3.03 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మహబూబాబాద్లో 12 మంది, జనగామ, ఖమ్మం, నిజామాబాద్లో ఒక్కొక్కరు, నాగర్ కర్నూల్, నల్లగొండలో ఇద్దరు చొప్పున కలిపి మొత్తం 19 మంది విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులను నమోదు చేశామని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్-1 పరీక్షకు సెట్ సీ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశామని వివరించారు. నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, నాగర్ కర్నూల్, హైదరాబాద్ జిల్లాల్లో ఇంటర్ బోర్డు నుంచి పరిశీలకులు వెళ్లి పరీక్షను పరిశీలించారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జరిగిందని తెలిపారు.