‘మైనం’పల్లి డబ్బును ఓట్లతో కరిగించండి

'మైనం'పల్లి డబ్బును ఓట్లతో కరిగించండి– మల్కాజిగిరి హైదరాబాద్‌కు గుండెకాయ: మంత్రి హరీశ్‌రావు
– నేరెడ్‌మెట్‌, మల్కాపూర్‌లో పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌కు మల్కాజిగిరి సెగ్మెంట్‌ గుండెకాయ వంటిదని, మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓట్లతో కరిగించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రచార సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మైనంపల్లి లాగ తాను దిగజారి మాట్లాడలేనన్నారు. బీఆర్‌ఎస్‌లో మైనంపల్లి గొడవ అందిరికీ తెలిసిందేనని తెలిపారు. హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారని చెప్పారు.
ఓటుతో ప్రజలే మైనంపల్లికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి కోరితే మల్కాజిగిరిని తాను దత్తత తీసుకుంటానని చెప్పారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి చేతిలో మైనంపల్లి ఓడిపోవడం ఖాయమన్నారు. కాలుష్యం తక్కువున్న నగరంగా హైదరాబాద్‌కు గ్లోబల్‌ అవార్డులు వస్తున్నాయని చెప్పారు.
అక్కడ అవార్డులు.. ఇక్కడ అసత్య ప్రచారం..
ఢిల్లీలో ప్రధాని మోడీ రాష్ట్రానికి అవార్డులు ఇస్తారని, హైదరాబాద్‌కు వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి నీటి సమస్యను తీర్చామన్నారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో నిర్వహించిన మహిళా సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వం అవార్డుల మీద అవార్డులు ఇచ్చిందని, ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి అబద్దాలు చెప్పారన్నారు. అవార్డులు ఇవ్వడం.. ఇక్కడ అసత్య ప్రచారం చేయడం కేవలం మోడీకే సాధ్యమైందని విమర్శించారు. రాష్ట్ర మిషన్‌ భగీరథ పథకాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ కాపీ కొట్టిందన్నారు.
కాంగ్రెస్‌ హయాంలో గల్లికో పేకాట క్లబ్బులు ఉండేవని తెలిపారు. ఈ పేకాట క్లబ్బుల నుంచి డబ్బులు కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లోకి వెళ్లేవన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే పేకాట క్లబ్బులు వస్తాయన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక పేకాట క్లబ్బులను ఉక్కుపాదంతో తొక్కేశారని తెలిపారు.