– కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీఐలో కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల బందం శుక్రవారం సమావేశం నిర్వహించింది. సాధారణ ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించింది. నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఈ బృందం పర్యటించనుంది. అందులో భాగంగానే నిర్వహించిన సమావేశంలో సమస్యాత్మాక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూమ్స్, పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతపై సమీక్షించారు. ఓటర్ల జాబితా, తప్పుల సవరణపై ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఎన్నికల నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, ఓటింగ్ శాతాన్ని పెంచేలా, ఓటింగ్ శాతం తక్కువ నమోదు అవుతున్న వాటిని గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.